Secretariat Employees సచివాలయ ఉద్యోగులకు బదిలీలు
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:48 PM
Transfers for Secretariat Employees సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నెల 30లోగా ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లాలో వార్డు సచివాలయాలు 38, గ్రామ సచివాలయాలు 312 వరకూ ఉన్నాయి. 3,150 మంది సిబ్బంది ఉన్నారు. 2 వేల మంది సచివాలయ ఉద్యోగులకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది.
సొంత మండలాల్లో నో పోస్టింగ్
ఈ నెల 30లోగా ప్రక్రియ పూర్తి
మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
పార్వతీపురం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నెల 30లోగా ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లాలో వార్డు సచివాలయాలు 38, గ్రామ సచివాలయాలు 312 వరకూ ఉన్నాయి. 3,150 మంది సిబ్బంది ఉన్నారు. 2 వేల మంది సచివాలయ ఉద్యోగులకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది. మైదాన ప్రాంతాల్లో పనిచేసే వారికి సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వరు. దంపతులకైతే సమీప మండలాల్లో పోస్టింగ్లు ఇవ్వనున్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ, క్యాన్సర్, కిడ్నీ మార్పిడి, న్యూరో సర్జరీ , కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలు పొందిన వారికి , 40 శాతం వైకల్యం , మానసిక దివ్యాంగులైన పిల్లలున్న వారికి, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల బాధ్యతను మునిసిపల్ కమిషనర్లకు, గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీ బాధ్యతను ఎంపీడీవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు అప్పగించారు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి? ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారు? సొంత మండలాల్లో పనిచేస్తున్నవారు ఎందరు? ఇలా అందరి సర్వీసులకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఉద్యోగుల ఎంపిక సమయంలో జరిగిన విధంగానే.. ఇప్పుడు బదిలీల్లో కూడా ఉమ్మడి జిల్లాను ప్రాతిపదికగా తీసుకుంటున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
రెండూ ఒకేసారి..
సచివాలయాల హేతుబద్ధీకరణతో పాటు బదిలీల ప్రక్రియ ఒకేసారి చేపట్టాలని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికే జనాభాకు అనుగుణంగా సచివాలయాలకు కేటగిరీలు ఇచ్చారు. వీటి పరిధిలో ఆరుగురు నుంచి 8 మంది ఉద్యోగులు ఉంటారు. జూలై 10లోగా హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఉద్యోగుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా బదిలీల నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు సిఫారసు లేఖల కోసం ఎగబడుతున్నారు. స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు, నేతల సాయంతో ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. వారికి నచ్చిన చోటకు బదిలీ చేయాలని కోరుతున్నారు.
Updated Date - Jun 22 , 2025 | 11:48 PM