municipal vehicles వాటిని వదిలించుకోరు.. వీటిని వినియోగించరు!
ABN, Publish Date - May 05 , 2025 | 11:42 PM
They Won’t Get Rid of Them… They Won’t Use These Either! సాలూరు మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉన్న వాహనాలను వినియోగించుకోరు. తుక్కుగా మారిన వాటిని వదిలించుకోరు.
మరమ్మతులకు గురై.. పారిశుధ్య వాహనాలు మూలకు..
కొత్తవాటికి డ్రైవర్ల కొరత
కౌన్సిల్లో తీర్మానించినా చర్యలు శూన్యం
సాలూరు రూరల్, మే5(ఆంధ్రజ్యోతి): సాలూరు మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉన్న వాహనాలను వినియోగించుకోరు. తుక్కుగా మారిన వాటిని వదిలించుకోరు. మున్సిపాలిటీలో పారిశుధ్య పనులకు గతంలో వినియోగించిన పలు వాహనాలు నిరుపయోగంగా మారాయి. వాటికి సకా లంలో మరమ్మతులు చేయకపోవడంతో అవి మూలకు చేరాయి. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. అధ్వానంగా మారాయి. ప్రస్తుతం అవి వినియోగానికి ఏ మాత్రం వీలులేని విధంగా తయారయ్యాయి. మరమ్మతులు కూడా చేపట్టలేని పరిస్థితి. ఇప్పటికైనా వాటిని తుక్కు కింద అమ్మితే ఎంతో కొంత మున్సిపల్ ఖజానాకు నిధులు జమయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా సెప్టిక్ట్యాంక్ క్లీనింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం సాలూరు మున్సిపాలిటీకి ఒక వాహనం ఇచ్చింది. అయితే డ్రైవర్ లేని కారణంగా 14 నెలలుగా ఆ వాహనం మూలన పడి ఉంది. రూ. 40 లక్షలతో ఏడాది కిందట కొనుగోలు చేసిన ఎక్స్కవేటర్ పరిస్థితి అదే విధంగా ఉంది. అప్పుడప్పుడు తాత్కాలిక డ్రైవర్తో దానిని వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ వాహనం కూడా మున్సిపల్ కార్యాలయంలో వృథాగా పడి ఉంది. శ్యామలాంబ పండగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రెండు వాహనాలకు చోదకులను నియమించాలని గత నెల కౌన్సిల్ సమావేశంలో సభ్యులు తీర్మానించారు. అయితే ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఈ విషయమై శానిటరీ ఇన్స్పెక్టర్ ఎల్.బాలకృష్ణను వివరణ కోరగా.. తుక్కుగా మారిన వాటిని మున్సిపల్ కమిషనర్ దృష్టిలో పెట్టి విక్రయానికి చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. కొత్త వాహనాలకు రెండు, మూడు రోజుల్లో చోదకులు రానున్నట్టు తెలిపారు.
Updated Date - May 05 , 2025 | 11:42 PM