There is no work in the secretariats! సచివాలయాల్లో పనులు కావట్లే!
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:08 AM
There is no work in the secretariats!
సచివాలయాల్లో పనులు కావట్లే!
మూలకు చేరుతున్న కంప్యూటర్లు
యూపీఎస్లు, ప్రింటర్లదీ అదే పరిస్థితి
నెట్ సౌకర్యం అంతంత మాత్రం
స్టేషనరీ కొనుగోలుకు నిధులు విదల్చని వైనం
ప్రజలకు అందుబాటులో ఉండే సచివాలయాల్లో సేవలు మాత్రం అందుబాటులో లేవు. వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం కాని, సమాచారం తెలుసుకోవాలని కాని, సమస్యలు చెప్పుకుందామని కాని వెళ్లే వారికి అక్కడ నిరాశే ఎదురవుతోంది. సచివాలయ వ్యవస్థ ఏర్పాటైనప్పడు ఇచ్చిన కంప్యూటర్లు, యూపీఎస్లు, ప్రింటర్స్ సరిగా పనిచేయకపోవడమే ఈ పరిస్థితికి కారణం. మూడు ప్రధాన కంపెనీల నుంచి ఇచ్చిన నెట్ కనెక్షన్లు కూడా అంతంతమాత్రంగా పనిచేస్తున్నాయి. వెరసి ఏ పనిపై సచివాలయానికి వెళ్లినా కంప్యూటర్ పనిచేయడం లేదని, నెట్ ఆగిపోయిందని సమాధానం వినిపిస్తోంది. నిరాశతో వెనుతిరగడం ప్రజలవంతువుతోంది.
విజయనగరం, జూలై 21 (ఆంధ్రజ్యోతి):
గత వైసీపీ ప్రభుత్వం 2019లో నూతనంగా గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకొచ్చింది. 12 శాఖలకు చెందిన ఉద్యోగులను నియమించాక ఆ సమయంలోనే కంప్యూటర్లు, యూపీఎస్లు, ప్రింటర్లు అందజేసింది. వాటిలో చాలా వరకు 2024 నాటికే మూలకు చేరాయి. దాదాపు 30 శాతం వరకూ పాడయ్యాయి. ఉన్నవి కూడా నిర్వహణ కొరవడి అంతంతమాత్రంగా పనిచేస్తున్నాయి. గతంలో సచివాలయ సిబ్బంది కొంత మొత్తం వారి జేబులో నుంచి తీసి తాత్కాలికంగా బాగు చేయించి నడిపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక సచివాలయ వ్యవస్థ కూడా యథాతథంగా కొనసాగుతోంది. సేవలు మాత్రం సరిగా అందడం లేదు. అక్కడ ఏ పని కావాలన్నా కంప్యూటర్తో అనుసంధానమై ఉంటుంది. అలాగే నెట్ కూడా ఉండాలి. ప్రస్తుతం చాలా సచివాలయాల్లో కంప్యూటర్లు మరమ్మతులకు గురయ్యాయి. విద్యుత్ సరఫరా లేని సమయంలో ఉపయోగపడాల్సిన యూపీఎస్లు 75 శాతం ఆగిపోతున్నాయి. ప్రింటర్లు 80 శాతం పాడయ్యాయి. కొందరు బయట ప్రింట్లు తీసుకునే పరిస్థితి ఉంది. కొన్ని సచివాలయాల్లో సిబ్బంది సర్వేలు, ఇతరత్రా పనులన్నీ వారి, వారి సెల్ద్వారా చేసి మెయిల్లో సేవ్ చేసి ఉంచుకుంటున్నారు.
జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 530 సచివాలయాలు ఉండగా, అర్బన్ ప్రాంతాల్లో 96 ఉన్నాయి. ఏడాది కాలంగా ప్రభుత్వం కంప్యూటర్లు, ఇతర పరికరాల నిర్వహణ కోసం ఎటువంటి నిధులు విడుదల చేయలేదు. సచివాలయం ద్వారా ఏ పని జరగాలన్నా, ఇంటర్నెట్ పైనే..కొన్నిచోట్ల ఆ సౌకర్యం అంతంతమాత్రంగా ఉంది. సచివాలయాలకు సంబంధించి ఏపీ ఫైబర్ నెట్, ఆరెంజ్ నెట్తో పాటు మరో నెట్ కంపెనీ నుంచి కనెక్షన్లు ఉన్నాయి. కొన్ని సచివాలయాల్లో నిరంతరం సిగ్నల్స్ అందడంలేదు. దీంతో సిబ్బంది తమ సెల్ఫోన్లలో ఉన్న నెట్ని వినియోగించి సేవలు అందిస్తున్నారు. వారి నెట్ బ్యాలెన్స్ ఉన్నంత వరకూ సేవలు అందుతున్నాయి. అయిపోతే మరుసటి రోజే.. అదే విధంగా కంప్యూటర్కు అందే డైరెక్ట్ నెట్, వైఫే సామర్థ్యం వేర్వేరుగా ఉంది. సెల్ ద్వారా వచ్చే నెట్తో పది నిమిషాల్లో జరగాల్సిన పని గంట పడుతోంది. కొన్నిగ్రామాల్లో మొబైల్ సిగ్నల్స్ కూడా అందని పరిస్థితి. హాజరు వెయ్యాలన్నా బయటకు వచ్చి బయోమెట్రిక్ వేస్తున్నారు. ఈ విధంగా సచివాలయాల్లో సమస్యలు తిష్టవేశాయి. మరోవైపు స్టేషనరీ సమస్య ఉంది. ప్రింటర్లలోకి ఇంకును కొనుగోలు చేసేందుకు కూడా నిధులు సమకూర్చడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం
ఎం.రోజారాణి, డివిజనల్ డిప్యూటీ డైరెక్టరు, సచివాలయాల శాఖ
విజయనగరంలో సచివాలయాల్లో కంప్యూటర్స్, ప్రింటర్స్, యూపీఎస్ల మరమ్మతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయా సచివాలయాల ద్వారా ప్రధాన కార్యాలయానికి సమాచారం వస్తోంది. నెట్లో కూడా సమస్య ఉంది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాక వీటిపై నివేదిక ఇవ్వనున్నాం. బడ్జెట్ విడుదలైన వెంటనే దశలవారీగా సచివాలయాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం.
విద్యుత్ బిల్లు కోసం గంట వేచి ఉన్నాను
అప్పలనర్సమ్మ, విజయనగరం
విద్యుత్ బిల్లు చెల్లించడం కోసం సచివాలయానికి వెళ్లాను. బిల్లు డబ్బులు ఇచ్చాక కూర్చోమని చెప్పారు. గంట అయినా చెల్లింపు పూర్తి కాలేదు. కారణం ఏమిటని అడిగాను. కంప్యూటర్ ఆన్ కాలేదన్నారు. ప్రింటర్ కూడా బాగాలేదని మధ్యాహ్నం వస్తే బిల్లు తీసి ఉంచుతానన్నారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి సచివాలయానికి వెళితే సిబ్బంది పక్క సచివాలయానికి వెళ్లి ఆ బిల్లును తీసుకువచ్చారు.
యూపీఎస్ పనిచేయక అరగంట ఉన్నాను
శ్రీనివాసరావు, గంట్యాడ
తల్లికి వందనం అర్హుల జాబితాలో కుమార్తె పేరు వుందో? లేదో? చెప్పాలని సచివాలయ సిబ్బందిని అడిగాను. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది కంప్యూటర్ పనిచేయడం లేదని చెప్పారు. అరగంట తర్వాత కరెంటు వచ్చాక నేను అడిగిన సమాచారం ఇచ్చారు. యూపీఎస్ పనిచేయకపోవడంతో కరెంటు పోయినప్పుడల్లా మా సచివాలయంలో ఇదే పరిస్థితి.
Updated Date - Jul 22 , 2025 | 12:08 AM