There is no garbage collection. చెత్తశుద్ధి లేకపోయె
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:06 AM
There is no garbage collection.
చెత్తశుద్ధి లేకపోయె
మునిసిపాలిటీల్లో చాలీచాలని పారిశుధ్య కార్మికులు
ఉన్నవారిపై పనిభారం
వర్షాకాలంలో మరింత కష్టమే
శివారు ప్రాంతాల్లో పేరుకుపోతున్న చెత్త నిల్వలు
రాజాం, జూన్ 3(ఆంధ్రజ్యోతి):
పురపాలక సంఘాలన్నింటా రోడ్లు, వీధులు, జంక్షన్లు, ముఖ్యమైన ప్రాంతాలు అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి. పారిశుధ్యం లేక దుర్గంధంగా మారుతున్నాయి. పట్టణాల జనాభాకు తగినట్లు పారిశుధ్య కార్మికులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. శాశ్వత కార్మికుల కంటే కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న వారే అధికంగా ఉన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానంలో కొత్త నియామకాలు లేవు. ఉమ్మడి జిల్లాలో విజయనగరం కార్పొరేషన్తో పాటు బొబ్బిలి, రాజాం, సాలూరు, పార్వతీపురం మునిసిపాల్టీలు, నెల్లిమర్ల, పాలకొండ నగర పంచాయతీలు ఉన్నాయి. మరో 10 వరకూ మేజర్ పంచాయతీలున్నాయి. ఎక్కడా పూర్తిస్థాయిలో పారిశుధ్య కార్మికులు లేరు. దీంతో పారిశుధ్య పనులు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పన్నులు వసూలు చేస్తున్న పాలకవర్గాలు సౌకర్యాల విషయంలో వెనుకడుగు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విజయనగరం కార్పొరేషన్లో 125 నుంచి 130 మెట్రిక్ టన్నుల మేర చెత్త ఉత్పత్తవుతోంది. 445 మంది ఔట్ సోర్సింగ్, 199 మంది రెగ్యులర్ కార్మికులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. కానీ పెరిగిన నగరానికి వీరు ఏమూలకు సరిపోవడం లేదు. మరో 100 మంది కార్మికులను నియమిస్తే కానీ పూర్తిస్థాయిలో పారిశుధ్య పనులు జరిగే అవకాశం లేదు. బొబ్బిలిలో రోజుకు సగటున 24 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. 105 మంది ఔట్ సోర్సింగ్, 42 మంది రెగ్యులర్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. 30 వార్డుల్లో పూర్తిస్థాయి చెత్త సేకరణ జరగాలంటే మరో 50 మంది వరకూ పారిశుధ్య కార్మికుల నియామకం చేపట్టాలి. సాలూరులో రోజుకు 18 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. 86 మంది ఔట్ సోర్సింగ్, 35 మంది రెగ్యులర్ కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా ఓ 40 మందిని నియమించాల్సి ఉంది. పార్వతీపురంలో 23 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. 88 మంది అవుట్ సోర్సింగ్, 38 మంది రెగ్యులర్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంగా విస్తరించినా ..ఆ స్థాయిలో పారిశుధ్య పనులు చేపట్టడానికి వీలులేకుండా పోతోంది. ఇక్కడ 100 మంది కార్మికులను నియమించాల్సి ఉంది. నెల్లిమర్ల నగర పంచాయతీలో రోజుకు సగటున 16 మెట్రిక్ టన్నుల మేర చెత్త ఉత్పత్తవుతోంది. ఇక్కడ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన 40 మంది పనిచేస్తుండగా.. రెగ్యులర్ కార్మికులు నలుగురు మాత్రమే ఉన్నారు. చంపావతి నదీ పరివాహక ప్రాంతం కావడం.. కుచించుకుపోయిన వీధులు, కాలువలు ఉండడంతో మరో 40 మంది వరకూ పారిశుధ్య కార్మికులను నియమించాల్సిన అవసరం ఉంది. రాజాంలో రోజుకు సగటున 16 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. 56 మంది అవుట్ సోర్సింగ్, ఆరుగురు రెగ్యులర్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మరో 50 మందిని నియమించాల్సి ఉంది. పాలకొండలో రోజుకు 12 నుంచి 14 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తవుతోంది. ఇక్కడ 68 మంది అవుట్ సోర్సింగ్, 9 మంది రెగ్యులర్ కార్మికులు ఉన్నారు. ఇక్కడ కూడా 40 మంది కార్మికుల నియామకం చేపట్టాల్సి ఉంది.
కొరత వాస్తవమే..
రాజాం మునిసిపాల్టీలో పారిశుధ్య కార్మికుల కొరత ఉంది. దీనిని అధిగమించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నవారితోనే పారిశుధ్య పనులు చేయిస్తున్నాం. కార్మికులను పెంచాలని ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం.
- జె రామప్పలనాయుడు, కమిషనర్, రాజాం మునిసిపాల్టీ
Updated Date - Jun 04 , 2025 | 12:06 AM