ఐదు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
ABN, Publish Date - Jun 05 , 2025 | 11:54 PM
జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు.
- స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అవసరం
- యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
- కలెక్టర్ శ్యామ్ప్రసాద్
సీతంపేట రూరల్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం సీతంపేట ఏజెన్సీలో ఆయన పర్యటించారు. వనం-మన్యం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి తురాయిపువలస ఉద్యానవన నర్సరీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వనం-మనం కార్యక్రమాన్ని ఏదో ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా, సొంత కార్యక్రమంలా నిర్వహించాలని సూచించారు. దీనికి స్థానిక స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అవసరమని అన్నారు. ఇంటి ఆవరణ, బయట, బహిరంగ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాతావరణ సమతుల్యతలో మార్పులు తీసుకురావాలని అన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. నిషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మాదకద్రవ్యాల నివారణపై వాక్థాన్ కార్యక్రమం నిర్వహించారు.
యువతకు ఉపాధి అవకాశాలు..
నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సీతంపేట ఐటీఐ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో స్కిల్హబ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం శాంప్లింగ్ టైలర్ కోర్సులను ప్రారంభించినట్లు చెప్పారు. ఇందులో శిక్షణ తీసుకుంటున్న 30మంది అభ్యర్థులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి ముందు హడ్డుబంగి, మెట్టుగూడ, మొగదార గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన గృహ నిర్మాణాలను పరిశీలించారు. బిల్లగూడ గ్రామంలో 75 ఎకరాల్లోని కేరళ మార్షియస్ రకం పైనాపిల్ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ రకం పైనాపిల్ ద్వారా గిరిజన రైతులకు అధిక ఆదాయం చేకూరుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన రైతులతో మాట్లాడి వారి అభి ప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం సీతంపేట ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. గిరిజనులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో పరికరాల పనితీరును పరిశీలించేందుకు కలెక్టర్ తన చెవికి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. బ్లడ్బ్యాంక్ను పరిశీలించి రక్తనిల్వలపై ఆరా తీశారు. ఈ పర్యటనలో ఐటీడీఏ పీవో సి.యశ్వంత్కుమార్రెడ్డి, ఏపీవో చిన్నబాబు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, పీహెచ్వో ఆర్వీ గణేష్, డైరెక్టర్ కవిత, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 05 , 2025 | 11:54 PM