అదును దాటిపోతుందని..
ABN, Publish Date - Jun 24 , 2025 | 12:07 AM
ఈ ఏడాది విభిన్న వాతావరణం కారణంగా రైతులు పొడి పొలాల్లోనే విత్తనాలు నాటు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- పొడిలోనే విత్తనాలు నాటుతున్న రైతులు
భామిని, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది విభిన్న వాతావరణం కారణంగా రైతులు పొడి పొలాల్లోనే విత్తనాలు నాటు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి మే నెలలో ఎండలు అధికంగా ఉండాలి. కానీ, వాతావరణ మార్పుల కారణంగా అధిక వర్షాలు కురిశాయి. దీనివల్ల వేసవి దుక్కులకు వీలు లేకుండాపోయింది. అయితే, జూన్లో వర్షాలు పడాల్సి ఉన్నా రుతు పవనాలు మందగించడంతో వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో కొందరు రైతులు మెట్టు దుక్కులు చేసుకున్నారు. ప్రతి ఏడాది జూన్ 12 నుంచి పత్తి, మొక్కజొన్న విత్తనాలు నాటడం ప్రారంభించేవారు. కానీ, జూన్ నెల ఆఖరవుతున్నా ఇప్పటికీ వాన జాడలేదు. దీంతో రైతులు పొడిలోనే పత్తి, మొక్కజొన్న విత్తనాలు నాటుతున్నారు. మండలంలో సుమారు ఐదు వేల ఎకరాల్లో మెట్టు సాగు అవుతుంది. భామిని, లివిరి, బురజోల, బొడ్డగూడ, పసుకుడి తదితర గ్రామాల రైతులు పొడిలోనే విత్తనాలు నాటారు. అయితే, సోమవారం మధ్యాహ్నం వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం మేలు చేస్తుందని చెబుతున్నారు. కానీ, పల్లపు పొలాల్లో వరిసాగుకు అవకాశం కూడా లేకుండాపోయిందని దిగాలు చెందుతున్నారు.
Updated Date - Jun 24 , 2025 | 12:07 AM