Target టార్గెట్ 2027
ABN, Publish Date - Jul 25 , 2025 | 11:30 PM
Target 2027 జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియ పూర్తికి ప్రభుత్వం 2027, డిసెంబరు 31 వరకు గడువు విధించింది. ఎటువంటి తప్పిదాలు లేకుండా ప్రక్రియ చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులు సన్నద్ధమ వుతున్నారు.
జాయింట్ ఎల్పీఎంల సరిచేసేందుకూ గడువు పెంపు
ఉత్తర్వులు జారీ
జియ్యమ్మవలస, జూలై25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియ పూర్తికి ప్రభుత్వం 2027, డిసెంబరు 31 వరకు గడువు విధించింది. ఎటువంటి తప్పిదాలు లేకుండా ప్రక్రియ చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులు సన్నద్ధమ వుతున్నారు. సెప్టెంబరు 15 నాటికి ఫీల్డ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ (ఎఫ్పీఓఎల్ఆర్)ను గ్రామ రెవెన్యూ అధికారులు సిద్ధం చేయాల్సి ఉంది. గ్రామాల్లో భూముల సరిహద్దును ఆగస్టు 5లోగా గ్రామ సర్వేయర్లు నిర్ణయించాలి. అదేవిధంగా నవంబరు 30లోగా ప్రభుత్వ భూముల పరిధిని తేల్చాలి. ఇదిలా ఉండగా.. జాయింట్ ఎల్పీఎంల ఆన్లైన్ సేవలకు కూడా ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబరు 31 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ గడువు జూన్ 30 వరకు ఉండేది. అయితే జిల్లాలో జాయింట్ ఎల్పీఎంలు సంఖ్య 14,514 వరకూ ఉన్నాయి. వాటిలో పాలకొండ డివిజన్లో 4,958, పార్వతీపురం డివిజన్లో 9,556 ఉన్నాయి. గతంలో జాయింట్ ఎల్పీఎంల సరిచేసేందుకు వైసీపీ ప్రభుత్వం రూ. 500లు వసూలు చేసేది. అయినా సమస్య పరిష్కారం కాలేదు. కూటమి ప్రభుత్వం మాత్రం రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కేవలం రూ. 50తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులబాటు కల్పించింది.
ఇదీ భౌగోళిక పరిస్థితి
జిల్లాలో పాలకొండ, పార్వతీపురం డివిజన్ల పరిధిలో 15 మండలాలు, 965 గ్రామాలు ఉన్నాయి. జిల్లాకు తూర్పున శ్రీకాకుళం, పడమర, ఉత్తర దిక్కుల్లో ఒడిశా రాష్ట్రం, దక్షిణాన విజయనగరం జిల్లా సరహద్దులుగా ఉన్నాయి. మన్యంలో మొత్తంగా 5,78,016.39 ఎకరాల్లో రీ సర్వే చేయాల్సి ఉంది. కాగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వే తప్పులు తడకలగా మారింది. దీనికితోడు జాయింట్ ఎల్పీఎం (ల్యాండ్ పార్శిల్ మ్యాప్) ఇవ్వడం వల్ల రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయితే ఇటువంటి తప్పిదాలన్నీ సరిచేయాలని కూటమి ప్రభుత్వం జిల్లా రెవెన్యూ, సర్వే అధికారులకు విధి విధానాలు అందించింది. కాగా ఈ ఏడాదిలో రెండు విడతలు రీసర్వే నిర్వహించారు. మొదటి విడతలో పైలెట్ ప్రాజెక్టు కింద 15 గ్రామాల్లోని 8,910.82 ఎకరాల్లో రీ సర్వే చేపట్టారు. రెండో విడతలో 30 రెవెన్యూ గ్రామాల్లోని 27,542.23 ఎకరాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తంగా రెండు విడతల్లోని జిల్లాలో 289 గ్రామాల్లో రీసర్వే పూర్తయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా 589 గ్రామాల్లో రీసర్వే జరగాల్సి ఉంది.
పరిష్కరిస్తాం..
రీసర్వే ద్వారా వాస్తవ భూవిస్తీర్ణం తేల్చి రైతులకు అప్పగిస్తాం. జాయింట్ ఎల్పీఎంలు ఉన్న వారు ఇబ్బందులు పడకుండా చూస్తాం. ఇటువంటి రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే కచ్చితంగా పరిష్కారం చూపిస్తాం.
-పి.లక్ష్మణరావు, ఏడీ, జిల్లా సర్వేశాఖ, పార్వతీపురం మన్యం
Updated Date - Jul 25 , 2025 | 11:30 PM