Steps towards 'Sports Development' ‘క్రీడా వికాస’ం వైపు అడుగులు
ABN, Publish Date - Jun 23 , 2025 | 11:48 PM
Steps towards 'Sports Development' క్రీడాకారుల్లో క్రీడాస్ఫూర్తిని నింపడంతో పాటు వారిలో ఆటలపై శ్రద్ధ పెరిగేలా చూడాలని తలచి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన మినీ స్టేడియాలకు (క్రీడా వికాస కేంద్రాలు) మళ్లీ మంచిరోజులు రానున్నాయి. నూతన క్రీడా విధానం అందుకు దోహదపడనుంది.
‘క్రీడా వికాస’ం వైపు అడుగులు
గతంలో టీడీపీ హయాంలోనే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు
ఐదేళ్లూ పట్టించుకోని వైసీపీ
నూతన క్రీడా విధానం ప్రకటించిన ప్రభుత్వం
క్రీడాకారుల్లో ఆనందం
రాజాం రూరల్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారుల్లో క్రీడాస్ఫూర్తిని నింపడంతో పాటు వారిలో ఆటలపై శ్రద్ధ పెరిగేలా చూడాలని తలచి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన మినీ స్టేడియాలకు (క్రీడా వికాస కేంద్రాలు) మళ్లీ మంచిరోజులు రానున్నాయి. నూతన క్రీడా విధానం అందుకు దోహదపడనుంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఈ కేంద్రాల పునర్నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశించింది. ప్రభుత్వం ప్రకటించిన నూతన క్రీడా విధానంలో భాగంగా క్రీడా కోటాలో ఇచ్చే ఉద్యోగాలను 3 శాతానికి పెంచారు. జాతీయస్థాయిలో స్వర్ణం, కాంస్య, రజత పథకాలు సాధించే వారికి వరుసగా రూ.10 లక్షలు, రూ.5 లక్షలు, రూ.3 లక్షలు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఖేల్ ఇండియా, నేషనల్ గేమ్స్లో రాణించిన వారికి రూ.2.5 లక్షలు, రూ.2 లక్షలు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో క్రీడా వనరులను అభివృద్ధి చేసుకునే సన్నాహాలు ప్రారంభించింది. పునాదుల్లోనే నిలిచిపోయిన క్రీడా వికాస కేంద్రాల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి.
జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-19లో ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రం నిర్మించాలని నిర్ణయించారు. తొలిదశలో ఏడు నియోజకవర్గాలలోని ఆరు ప్రాంతాల్లో క్రీడా వికాస కేంద్రాలు, ఒకచోట వాటర్స్పోర్ట్స్ అకాడమీ పనులకు శ్రీకారం చుట్టారు. ఒక్కో కేంద్రానికి రూ. 2 కోట్లు వంతున జిల్లాకు రూ.14కోట్లు నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో ఇండోర్ స్టేడియం, పెవిలియన్, 200 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, లాంగ్ జంప్, కబడ్డీ, క్రికెట్ ప్రాక్టీస్ పిచ్, వాలీబాల్ కోర్టు, ఖోఖో ప్రాంగణం వంటివి నిర్మించాలనుకున్నారు. అయితే జిల్లాలో పనులు ప్రారంభమైనా.. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ హయాంలో చేపట్టిన పథకాలకు, పనులకు తిలోదకాలివ్వడంతో క్రీడా వికాస కేంద్రాల నిర్మాణం పనులకు కూడా బ్రేక్ పడింది. గతేడాది జూన్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక క్రీడాకారుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నూతన క్రీడా విధానాన్ని ప్రకటించింది. క్రీడా వికాసకేంద్రాలను పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది.
ఎక్కడెక్కడ.. ఎలా?
రాజాం మండల పరిధిలోని కంచరాం పంచాయతీలో మాజీ మంత్రి, ప్రస్తుత చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రిగా ఉన్నప్పుడు క్రీడావికాస కేంద్రానికి 2018 జనవరి 28న శంకుస్థాపన చేశారు. ఓ షెడ్తో పాటు మరుగుదొడ్ల కోసం పునాదుల పనులు ప్రారంభమయ్యాయి. వైసీపీ పాలనలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. జిల్లా కేంద్రంతో పాటు బొబ్బిలిలోనూ నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని డెంకాడలో పునాదులకే పరిమితం కాగా, గజపతినగరంలో భూసేకరణ జరగలేదు. చీపురుపల్లి నియోజకవర్గంలో సైతం నిర్మాణం పనులు శ్లాబ్కే పరిమితం అయ్యాయి. తాటిపూడి జలాశయం వద్ద నిర్మించ తలపెట్టిన వాటర్ స్పోర్ట్స్ అకాడమీకి పర్యాటక శాఖ భూమిని సమకూర్చింది. అవసరమైన పరికారాలు సైతం అందుబాటులోకి వచ్చినా వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు పడకేశాయి.
ప్రభుత్వానికి ప్రతిపాదించాం
వెంకటేశ్వర్రావు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి, విజయనగరం
జిల్లాలో అసంపూర్తిగా ఉన్న క్రీడా వికాస కేంద్రాల పునర్నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఎక్కడెక్కడ ఏ మేర పనులు జరిగాయి... ఇంకా ఏమేరకు జరగాలి.. పూర్తికావాల్సిన పనులెన్ని.. ఎంత వరకు నిధులు అవసరమవుతాయో ప్రతిపాదించాం. తాటిపూడి రిజర్వాయర్ వద్ద నిలిచిపోయిన వాటర్ స్పోర్ట్స్ అకాడమీ పనులు పూర్తి చేయడానికి సుమారు రూ.5 కోట్లు అవసరమని నివేదించాం.
Updated Date - Jun 23 , 2025 | 11:48 PM