Six-year-old house...unpaid bills ఆరేళ్ల కిందటి ఇళ్లు.. అందని బిల్లులు
ABN, Publish Date - Jul 22 , 2025 | 11:49 PM
Six-year-old house...unpaid bills కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని నేతలు ప్రకటించారు. ఎందుకో ఏడాది దాటుతున్నా అది కార్యరూపం దాల్చలేదు. గృహనిర్మాణ లబ్ధిదారులు ప్రభుత్వ స్పందన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఆరేళ్ల కిందటి ఇళ్లు.. అందని బిల్లులు
ఎన్టీఆర్ గృహ నిర్మాణ లబ్ధిదారుల ఎదురుచూపు
జిల్లాలో 5,186 ఇళ్లకు రూ.15.52 కోట్లు పెండింగ్
కొద్ది నెలల కిందట వివరాల సేకరణ
ఇంకా కలగని మోక్షం
- రాజాం మండలం గురవాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. రూ.2 లక్షలకు గాను రూ.లక్ష వరకూ బిల్లులు ఖాతాలో పడ్డాయి. మిగతా బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాడు.
- వంగర మండలం కొప్పర కొత్తవలస గ్రామానికి చెందిన వ్యక్తికి 2017లో టీడీపీ ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసింది. పనులు ప్రారంభించగా పునాదులు, శ్లాబు స్థాయిలో బిల్లులు పడ్డాయి. శ్లాబు అనంతరం రూ.80 వేలకు పైగా బిల్లు రావాల్సి ఉంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎటువంటి బిల్లులు చెల్లించలేదు. ఇప్పుడైనా కదలిక వస్తుందన్న ఆశతో ఉన్నాడు.
రాజాం, జూలై 22(ఆంధ్రజ్యోతి):
కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని నేతలు ప్రకటించారు. ఎందుకో ఏడాది దాటుతున్నా అది కార్యరూపం దాల్చలేదు. గృహనిర్మాణ లబ్ధిదారులు ప్రభుత్వ స్పందన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ముందు ప్రభుత్వం చేపట్టిన పథకాలను, ప్రాజెక్టులను తరువాత ప్రభుత్వాలు కొనసాగించడం ఆనవాయితీ. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ఆనవాయితీకి బ్రేక్ వేసింది. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకాన్ని పూర్తిగా విస్మరించింది. 2014-19 మధ్య నిర్మించిన ఇళ్లకు రకరకాల కారణాలు చూపుతూ పెండింగ్ బిల్లులు చెల్లించలేదు. దీంతో ఐదేళ్లు లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ హయాంలో నిర్మాణం పూర్తిచేసుకున్న వారికి బిల్లులు చెల్లిస్తారని ఆశలు పుట్టాయి. నేతలు కూడా హామీ ఇచ్చారు. ఇంకా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5,186 ఇళ్లకుగాను రూ.15.52 కోట్లు చెల్లించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎందుకో మోక్షం కలగడం లేదు.
చివరి ఏడాదిలోనే పెండింగ్
2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకాన్ని ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి రూ.2 లక్షలు మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సబ్ప్లాన్ నిధుల నుంచి మరో రూ.70 వేల నుంచి లక్ష వరకూ అదనంగా మంజూరు చేసింది. అయితే 2017 వరకూ మంజూరైన ఇళ్లకు బిల్లుల చెల్లింపులు సక్రమంగానే జరిగాయి. అటు తరువాత ఇంటి బిల్లుల చెల్లింపులో కాస్తా జాప్యం జరిగింది. ఇంతలో ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రావడంతో చెల్లింపులు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెండింగ్ బిల్లులు చెల్లించలేదు. సమస్య చెప్పినా పట్టించుకోలేదు.
బిల్లుల పేరిట కలెక్షన్లు..
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక నాయకులు చాలాచోట్ల కలెక్షన్ల పర్వానికి దిగారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లకు బిల్లులు మంజూరు చేయిస్తామని చాలా గ్రామాల్లో భారీగా వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే జగన్ సర్కారు నుంచి ఉలుకూపలుకూ లేకపోవడంతో లబ్ధిదారులు నిలువునా మోసపోయారు. అటు బిల్లులు రాక.. ఇటు నేతలకు కొంత వరకూ సమర్పించుకొని రెండింటికీ చెడ్డ రేవడిగా మారిపోయారు. జిల్లాలో ఎక్కువగా రాజాం నియోజకవర్గంలో ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో చెల్లింపులు ఉండిపోయాయి. అత్యల్పంగా విజయనగరం నియోజకవర్గంలో రూ.68 లక్షలు చెల్లించాల్సి ఉంది.
త్వరలోనే నిధులు
ఎన్టీఆర్ ఇళ్ల బిల్లులకు సంబంధించి జిల్లాలో సర్వే పూర్తయ్యింది. 5,186 ఇళ్లకుగాను రూ.15.52 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం వద్ద కూడా సమగ్ర సమాచారం ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే వెంటనే లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాం.
- శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ, విజయనగరం
ఎన్టీఆర్ ఇళ్లకు చెల్లించాల్సిన బిల్లలు ఇలా
==================================
నియోజకవర్గం లబ్ధిదారులు బిల్లులు
==================================
1.రాజాం 1531 రూ.4.2 కోట్లు
2.బొబ్బిలి 803 రూ.2.31కోట్లు
3.నెల్లిమర్ల 762 రూ.2.52కోట్లు
4.చీపురుపల్లి 498 రూ.1.53కోట్లు
5.విజయనగరం 192 రూ.68 లక్షలు
6.ఎస్.కోట 662 రూ.1.99 కోట్లు
7.గజపతినగరం 642 రూ.1.97కోట్లు
Updated Date - Jul 22 , 2025 | 11:50 PM