Should the Goddess Herself Tell Us? అమ్మవారే చెప్పాలా?
ABN, Publish Date - May 14 , 2025 | 11:08 PM
Should the Goddess Herself Tell Us? మున్సిపాల్టీల్లో నిధులు లేక పనులు జరగకపోవడం సహజం. కానీ సాలూరులో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత జరిగే శ్యామలాంబ ఉత్సవాల పనులకు నిధులు మంజూరై రెండు నెలలు గడిచినా ఇంతవరకు అతీగతీ లేదు. వైసీపీ పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా పనులు ముందకు కదలడం లేదు.
నిధులున్నా.. ముందుకు కదలని పనులు
టెండర్లు పిలిచినా.. వర్క్ ఆర్డర్లు ఇవ్వని వైనం
సహకరించని వైసీపీ పాలకవర్గం
అధికారుల తీరుపైనా విమర్శలు
మంత్రి చెప్పినా మారని పరిస్థితి
భక్తులకు ఇబ్బందులు తప్పవా?
పెదవి విరుస్తున్న పట్టణవాసులు
పార్వతీపురం/సాలూరు, మే14(ఆంధ్రజ్యోతి): మున్సిపాల్టీల్లో నిధులు లేక పనులు జరగకపోవడం సహజం. కానీ సాలూరులో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత జరిగే శ్యామలాంబ ఉత్సవాల పనులకు నిధులు మంజూరై రెండు నెలలు గడిచినా ఇంతవరకు అతీగతీ లేదు. వైసీపీ పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా పనులు ముందకు కదలడం లేదు. దీనిపై మంత్రి సంధ్యారాణి ఆదేశించినా పరిస్థితి మారలేదు. ఉత్సవాలు విజయవంతంగా జరిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఆలోచనతోనే పురపాలక సంఘం నుంచి సహకారం అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాగా మరో మూడు రోజుల్లో పండగ ప్రారంభమవగా.. అఽధికారులు ఇప్పటివరకు వర్క్ ఆర్డర్లు కూడా ఇవ్వలేదు. దీనిపై పట్టణవాసులు పెదవి విరుస్తున్నారు. అభివృద్ధి పనులకు వైసీపీ పాలకవర్గం అడ్డు తగలడంపై మండిపడుతున్నారు. పండగకు వచ్చే భక్తులకు ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
సాలూరు మున్సిపాల్టీలో 29 వార్డులున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ వార్డులను వైసీపీ వారే కైవసం చేసుకున్నారు. వైసీపీ పాలకవర్గం కొలుదీరిన తర్వాత మున్సిపాల్టీలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులేవీ జరగలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మున్సిపాల్టీపై దృష్టి సారించారు. పెండింగ్ బిల్లులు చెల్లించి.. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించారు. పారిశుధ్యం, తాగునీరు, రహదారులపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈ క్రమంలోనే 15 ఏళ్ల తర్వాత జరిగే శ్యామలాంబ అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. తాగునీరు, పారిశుధ్యం నిర్వహణ, రోడ్లపై గుంతల పూడ్చివేత, సామూహిక మరుగుదొడ్ల మరమ్మతులు, అవసరమైన టాయిలెట్లు, కల్వర్టుల నిర్మాణం, బ్లీచింగ్, స్ర్పేయింగ్ మిషన్లు, మలేరియా నివారణ మందు పిచికారీ తదితర పనుల కోసం రూ.2కోట్లు కేటాయించారు. మార్చి 17న మున్సిపల్ ఖాతాలో ఆ నిధులు జమయ్యాయి. అయితే వైసీపీ పాలకవర్గం సహకరించకపోవడం వల్ల ఇప్పటివరకు పనులు ముందుకు సాగలేదు. దీంతో మంత్రి సంధ్యారాణి ఈ నెల 5న జాయింట్ కలెక్టర్ శోభిక ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జిల్లా స్ధాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. పండుగ ఏర్పాట్లపై చర్చించారు. పనులు జరగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు మంచినీళ్లు కూడా ఇవ్వలేమా? అంటూ ప్రశ్నించారు. ఏదేమైనా ఉత్సవాలకు సమయం సమీపిస్తున్నందున.. మంజూరైన నిధులతో పనులు వేగవంతంగా జరపాలని ఆదేశించారు. దీంతో మున్సిపల్ అధికారులు ఈనెల తొమ్మిదో తేదీన టెండర్లు పిలిచారు. అయితే కొద్దిమంది టెండరు దారులే ముందుకొచ్చారు. తక్కువ మొత్తానికి ఎవరైతే టెండర్ వేస్తారో వారికి పనులు అప్పగించాల్సి ఉంది. అయితే ఇంతవరకు వర్క్ ఆర్డర్లు ఇవ్వలేదు. దీంతో అభివృద్ధి పనులు పండుగ లోపు జరిగేనా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
గత సమస్యలు పునరావృతం కాకుండా..
సాలూరులో 2010లో జరిగిన శ్యామలాంబ ఉత్సవాల్లో ప్రధానంగా విద్యుత్ సమస్య వేధించింది. దీంతో గత సమస్యలు పునరావృతం కారాదని మంత్రి ముందుగానే ఆలోచించారు. ఆ శాఖకు సుమారు రూ.కోటి కేటాయించారు. ఈ నిధులతో సంబంధిత అధికారులు ఇప్పటికే పట్టణంలో 20 ట్రాన్స్ఫార్మర్లు, సుమారు వందకు పైగా విద్యుత్ స్తంభాలు వేయించారు. ఈ సారి ఉత్సవాల్లో విద్యుత్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఇకపోతే మున్సిపాల్టీకి మంజూరు చేసిన రూ. రెండు కోట్లలో కొంతమొత్తాన్ని తాగునీరు , పారిశుధ్యం, ఇతర సేవల కోసం వెచ్చించాల్సి ఉన్నా.. ఆ దిశగా అధికారులు, వైసీపీ పాలక వర్గం చర్యలు తీసుకోలేదు. ఇప్పటికే పండగ సందడి ప్రారంభమైన నేపథ్యంలో త్వరితగతిన పనులు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.
వర్క్ ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంది..
పనులకు సంబంధించి కొంతమంది టెండర్దారులు ముందుకు వచ్చారు. దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించాం. వర్క్ ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంది.
- డీటీవీ కృష్ణారావు, కమిషనర్, సాలూరు మున్సిపాల్టీ
Updated Date - May 14 , 2025 | 11:08 PM