easing labor pains సకాలంలో స్పందించి.. ప్రసవ వేదన తప్పించి..
ABN, Publish Date - Apr 18 , 2025 | 11:49 PM
Responding in time... easing labor pains వివాదాస్పద కొఠియా గ్రూప్కు చెందిన ఓ గిరిజన గర్భిణికి సకాలంలో వైద్య సేవలందేలా చేశారు తోణాం పీహెచ్సీ వైద్యాధికారి. నెలలు నిండకుండానే ప్రసవ వేదనతో అల్లాడుతున్న ఆమె పరిస్థితిని ఏఎన్ఎం ద్వారా తెలుసుకున్నారు. వ్యూహాత్మకంగా ఆలోచించి.. ఆ గ్రామం నుంచి పట్టణానికి రప్పించారు. సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
సత్వర కాన్పునకు చర్యలు
వ్యూహాత్మకంగా ఆలోచించిన తోణాం వైద్యుడు
సాలూరు రూరల్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): వివాదాస్పద కొఠియా గ్రూప్కు చెందిన ఓ గిరిజన గర్భిణికి సకాలంలో వైద్య సేవలందేలా చేశారు తోణాం పీహెచ్సీ వైద్యాధికారి. నెలలు నిండకుండానే ప్రసవ వేదనతో అల్లాడుతున్న ఆమె పరిస్థితిని ఏఎన్ఎం ద్వారా తెలుసుకున్నారు. వ్యూహాత్మకంగా ఆలోచించి.. ఆ గ్రామం నుంచి పట్టణానికి రప్పించారు. సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె సుఖప్రసవమైంది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
సాలూరు మండలం కొఠియా గ్రూప్ గ్రామం సిమ్మగెడ్డకు చెందిన బుడియా పారమ్మకు కొన్నేళ్ల కిందట సలపరబందకు చెందిన కాంబుతో వివాహమైంది. ఎనిమిది నెలల కిందట పారమ్మ గర్భం దాల్చింది. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఉపాధి పని కోసం వలస వెళ్లిన భర్త కాంబు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కూలి పనుల కోసం ఆమె బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట సమీపంలో ఉన్న అక్యానవలసకు వలస వెళ్లింది. కాన్పు తేదీ దగ్గర పడుతుండడంతో ఇటీవల సలపరబందకు వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం నొప్పులు రావడంతో గంజాయిభద్ర ఏఎన్ఎం కవిత తోణాం పీహెచ్సీ వైద్యుడు అక్యాన అజయ్కు సమాచారమిచ్చారు. ఆ గ్రామం కొఠియా గ్రూపులో ఉండడంతో ఏపీ 108 వాహనం పంపితే ఒడిశా పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఆలోచించిన వైద్యుడు అజయ్ అక్కడే ఆటోను ఏర్పాటు చేశారు. పారమ్మ ఆటోలో సజావుగా నేరేళ్లవలస సంతకు చేరుకునేలా చేశారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన ఫీడర్ అంబులెన్స్లో తోణాం పీహెచ్సీకి తరలించారు. ఆమెకు తొలి కాన్పు కావడం, పురిటినొప్పులు తీవ్రంగా ఉండడంతో 108 వాహనంలో సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు. అయితే ఆ వాహనం మామిడిపల్లికి వచ్చేసరికి గాలివాన కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. అప్రమత్తమైన సిబ్బంది ఈ విషయాన్ని సాలూరుకు ఆసుపత్రికి తెలియజేశారు. దీంతో అధికారులు పట్టణం నుంచి మామిడిపల్లి పీహెచ్సీకి 108 వాహనం పంపారు. అక్కడ ట్రాఫిక్లో నిలిచిన వాహనంలో ఉన్న గర్భిణి పారమ్మ దించి నడిపించుకుంటు వెళ్లి సాలూరు నుంచి వచ్చిన వాహనంలో ఎక్కించారు. ఆమెను సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్యులు ఆమెకు ప్రసవం చేశారు. పారమ్మ ఆడబిడ్డకు జన్మించింది. ‘అసలు పారమ్మకు ఇంకా నెలలు నిండ లేదు. వచ్చే నెల 25 వరకు డెలివరీకి సమయం ఉంది. ఈ లోగా నొప్పులు రావడంతో ఒడిశా పోలీసులు ఇబ్బందులు రాకుండా సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించాం.’ అని తోణాం పీహెచ్సీ వైద్యుడు అజయ్ తెలిపారు.
Updated Date - Apr 18 , 2025 | 11:49 PM