Register Post Booking Easy రిజిస్టర్ పోస్టు బుకింగ్ ఈజీ
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:11 AM
Register Post Booking Easy గ్రామగ్రామాన విస్తరించి ఉన్న అతి పెద్ద నెట్వర్క్ కలిగిన తపాలా శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను విస్తరించుకుంటోంది. సొంతంగా రూపొందించుకున్న అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ అమలుకు రంగం సిద్ధం చేసింది. మంగళవారం నుంచే ఆ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
రిజిస్టర్ పోస్టు బుకింగ్ ఈజీ
ఇక ఇంటి నుంచే అవకాశం
నేటి నుంచే అమలు
తపాలా శాఖలో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సేవలు
బొబ్బిలి, జూలై 21 (ఆంధ్రజ్యోతి):
గ్రామగ్రామాన విస్తరించి ఉన్న అతి పెద్ద నెట్వర్క్ కలిగిన తపాలా శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను విస్తరించుకుంటోంది. సొంతంగా రూపొందించుకున్న అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ అమలుకు రంగం సిద్ధం చేసింది. మంగళవారం నుంచే ఆ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఇంటి నుంచే వినియోగదారులు రిజిస్టర్ పోస్టు బుకింగ్ చేసుకోవచ్చు. ఇప్పటికే బ్యాంకింగ్ సేవలకు ఏమాత్రం తీసిపోని రీతిలో పబ్లిక్ మొబైల్ బుకింగ్ సేవలను అమలు చేస్తోంది. ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఇంటి వద్ద నుంచే రిజిస్టర్ పోస్టు బుకింగ్ సేవలకు మంగళవారం నుంచి శ్రీకారం చుడుతోంది. దీంట్లో భాగంగా ఎవరైనా వినియోగదారుడు మొబైల్ యాప్లో పోస్టల్ సిబ్బందికి రిక్వెస్ట్ మెసేజ్ పంపాలి. తర్వాత తపాలాశాఖ నుంచి బార్కోడ్ నెంబరు, ఓటీపీ వస్తుంది. ఇంటికొచ్చే పోస్టల్ ఉద్యోగి దగ్గర వీటిని సరిచూసుకొని రిజిస్టర్ పోస్టులేవైనా బుక్ చేసుకోవచ్చు. రూ.500 లోపు విలువ చేసే వాటికి ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. రూ.500 దాటితే నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా వినియోగదారులు పోస్టాఫీసుకు వెళ్లి, అక్కడ క్యూలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. సులభశైలిలో పోస్టల్ సేవలు పొందవచ్చు.
చాలా మంచి విధానం
బి.సత్యనారాయణ, ప్రభుత్వ రిటైర్డ్ టీచరు, బొబ్బిలి
ఇంటి వద్ద నుంచే రిజిస్టర్ పోస్టులను బుక్ చేసుకునే విధానం స్వాగతించదగ్గది. రద్దీగా ఉండే పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యకు ఎదురొడ్డి తపాలాశాఖ కార్యాలయానికి వెళ్లడం ఇబ్బందిగా ఉంటోంది. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకైతే ఈ సమస్య ఇంకా తీవ్రంగా ఉంది. అలాంటి వారికి పోస్టల్ సేవలను ఇంటివద్ద నుంచే అందించడం చాలా మంచిది.
22 నుంచే డోర్ స్టెప్ సేవలు
ఎం.సత్యనారాయణ, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్
పోస్టల్ శాఖలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా డోర్స్టెప్ సేవలను ప్రారంభిస్తున్నాం. ఈ నెల 22 నుంచి ఆధునిక జీవనశైలికి తగ్గట్టుగా పోస్టల్ డిపార్టుమెంటులో సేవలుంటాయి. ఇన్నాళ్లూ వాడిన థర్డ్పార్టీ సాఫ్ట్వేర్ స్థానంలో సొంత సాఫ్ట్వేర్తో వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించనుంది. ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయకుండానే డోర్ స్టెప్ సేవలను తమ శాఖ అందిస్తోంది. మొబైల్ యాప్ ద్వారా సేవలను ముమ్మరం చేశాం.
--------------------
Updated Date - Jul 22 , 2025 | 12:11 AM