ఇక డిజిటల్ ‘మెప్మా’
ABN, Publish Date - Jul 05 , 2025 | 12:40 AM
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో డిజిటలైజేషన్కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- అంతా ఆన్లైన్లోనే కార్యకలాపాలు
-సిబ్బందికి ట్యాబ్ల అందజేత
రాజాం రూరల్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో డిజిటలైజేషన్కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రుణాల చెల్లింపు, రికవరీ వంటి సంస్థాగత నిర్వహణ కార్యక్రమాలనీ ఇకపై ఆన్లైన్లోనే జరగనున్నాయి. దీనికోసం ఇప్పటికే మెప్మా సిబ్బందికి ట్యాబ్లు అందజేశారు. జిల్లాకు సంబంధించి 318 ట్యాబ్లను ప్రభుత్వం సరఫరా చేసింది. విజయనగరం కార్పొరేషన్కు 201, బొబ్బిలి మున్సిపాలిటీకి 57, రాజాం మున్సిపాలిటీకి 35, నెల్లిమర్ల నగర పంచాయతీకి 25 ట్యాబ్లను అందజేశారు. వీటిని టెక్నికల్ ఎక్స్పర్ట్లు, సిటీ మెషిన్ మేనేజర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, రిసోర్స్ పర్సన్లు, టీఎల్ఎఫ్, సిబ్బందికి కేటాయించారు. ఇకపై వీరంతా మెప్మాలో జరిగే లావాదేవీలు, కార్యక్రమాలన్నీ ట్యాబ్ల ద్వారానే నిర్వహించనున్నారు.
అన్నీ యాప్లోనే..
స్వయం సహాయక సంఘాల నిర్వహణ, లావాదేవీలన్నీ గతంలో పుస్తకాల్లో నమోదు చేసేవారు. ఇందుకోసం గంటల సమయం కేటాయించాల్సి వచ్చేది. సంఘాల్లో అవకతవకలు జరిగినప్పుడు, తప్పిదాలు చోటు చేసుకున్నప్పుడు ఆ రికార్డులను పరిశీలిస్తే గానీ ఎక్కడ, ఎవరు తప్పు చేశారనేది తెలిసేది కాదు. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండకుండా అంతా డిజిటలైజేషన్ చేశారు. ప్రభుత్వం మెప్మా సిబ్బందికి అందజేసిన ట్యాబ్ల్లో నాలుగు రకాల యాప్లు ఉన్నాయి. స్వయం సహాయక సంఘాల నిర్మాణం, కార్యక్రమాలు, రుణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి యాప్లు ఉన్నాయి. ఎస్హెచ్జీల నిర్వహణ, మెప్మా సేవలన్నీ ఆన్లైన్లో మహిళా యాప్ ద్వారానే నిర్వహిస్తారు. మహిళా సంఘాల సంస్థాగత నిర్మాణం, రుణాల చెల్లింపు, రికవరీ మొత్తం ఆన్లైన్లోనే నమోదు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, ఎస్హెచ్జీలకు అమలు చేస్తున్న పథకాలు సైతం ట్యాబ్ల్లోనే నిక్షిప్తం చేస్తారు. సమావే శాల నిర్వహణ ఫొటోలు, సభ్యుల హాజరు, ఇతర అంశాలన్నీ ట్యాబ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని ఆర్పీ నుంచి మెప్మా ప్రాజెక్ట్ట్ డైరెక్టర్ వరకూ పరిశీలించనున్నారు. దీనివల్ల అవకతవకలు జరిగేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి.
అవగాహన పెంచుకోవాలి
ఇక నుంచి మెప్మా కార్యకలాపాల్లో పెన్నూ, పేపర్ అవసరం తగ్గనుంది. అన్నీ ఆన్లైన్లో జరగనున్నాయి. సమాచారం అంతా ట్యాబుల్లో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. ట్యాబ్ల వినియోగంపై సీవోలు, ఆర్పీలు, టీఎంసీలు అవగాహన పెంచుకోవాలి.
-గంటా వెంకట చిట్టిరాజు, ప్రాజెక్ట్ డైరెక్టర్, మెప్మా, విజయనగరం.
Updated Date - Jul 05 , 2025 | 12:40 AM