No Work 15 రోజులుగా పనిచేయట్లే..
ABN, Publish Date - May 03 , 2025 | 11:12 PM
No Work for the Last 15 Days.. పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సీటీస్కాన్ సేవలు నిలిచిపోయాయి. గత 15 రోజులుగా అది పనిచేయడం లేదు. దీంతో ఆ గదిని మూసివేయగా.. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోగులకు తప్పని ఇబ్బందులు
బెలగాం, మే3 (ఆంధ్రజ్యోతి) : పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సీటీస్కాన్ సేవలు నిలిచిపోయాయి. గత 15 రోజులుగా అది పనిచేయడం లేదు. దీంతో ఆ గదిని మూసివేయగా.. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా జిల్లా ఆసుపత్రి నిత్యం రోగులతో కిటకిలాడుతుంది. రోజూ వందలాది మంది వస్తుంటారు. మెదడు, ఊపిరితిత్తులు, క్షతగాత్రులు, పొట్టలో సమస్యలు ఉన్న వారికి సీటీ స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే కొద్దిరోజులుగా అది పనిచేయకపోవడంతో ఆయా రోగులు నానా అవస్థలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు తరలివెళ్లాల్సి వస్తోంది. ఒక్కొక్కరూ రూ. 3వేల నుంచి రూ.4 వేల వరకూ చెల్లించాల్సి వస్తోంది. మొత్తంగా పేదలు, గిరిజన రోగులపై ఆర్థిక భారం పడుతోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన సీటీ స్కానింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగశివజ్యోతిని వివరణ కోరగా.. ‘ఈ సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేశాం. సింగపూర్ నుంచి పార్ట్స్ రావల్సి ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.’ అని తెలిపారు.
Updated Date - May 03 , 2025 | 11:12 PM