డీసీసీబీ, డీసీఎంఎస్ పీఐసీలుగా నాగార్జున, కృష్ణ బాధ్యతల స్వీకరణ
ABN, Publish Date - Jun 08 , 2025 | 11:57 PM
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా మార్కెటింగ్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పర్సన్ ఇన్చార్జిలుగా(పీఐసీ) టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, ఎస్.కోటకు చెందిన టీడీపీ నేత గొంపా కృష్ణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
విజయనగరం రూరల్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా మార్కెటింగ్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పర్సన్ ఇన్చార్జిలుగా(పీఐసీ) టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, ఎస్.కోటకు చెందిన టీడీపీ నేత గొంపా కృష్ణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. డీసీసీబీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రజాస్వామ్య విధానాలు అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా టీడీపీ కళా కుటుంబానికి మంచి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ.. కష్టసమయంలో ఉమ్మడి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నాగార్జున మంచి సేవలు అందించారన్నారు. తాజాగా డీసీసీబీ పీఐసీగా బాధ్యతలు నిర్వహించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. డీసీసీబీని ప్రక్షాళన చేసి, అందరికీ ఉపయోగపడేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు. తొలుత డీసీసీబీ సీఈవో సీహెచ్ ఉమామహేశ్వరరావు కిమిడి నాగార్జునతో ప్రమాణం చేయించారు. అనంతరం జరిగే కార్యక్రమానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు అధ్యక్షత వహించారు. జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ సేవలు మరింత విస్తృతం చేసి, ఈ సంస్థను ఆదాయం బాట పట్టిస్తానని, ఇందుకు అందరూ సహకరించాలని డీసీఎంఎస్ పీఐసీ గొంపా కృష్ణ కోరారు. నాగార్జున అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు చీపురుపల్లిలో మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, కోండ్రు మురళీమోహన్, బేబినాయన, అదితి గజపతిరాజు, బోనేల విజయచంద్ర, లోకం నాగమాధవి, నిమ్మక జయకృష్ణ, మాజీ మంత్రి కిమిడి మృణాళిని, మాజీ ఎమ్మెల్యేలు ఆర్పీ భంజ్దేవ్, కిమిడి గణపతిరావు, తెంటు లక్ష్మునాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్వర్మ, ఆర్.పావనీ, జనసేన నేత గురాన అయ్యలు, అవనాపు విక్రమ్ తదితరులు నాగార్జున, కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Jun 08 , 2025 | 11:57 PM