కలపపై కన్నేశారు
ABN, Publish Date - May 11 , 2025 | 11:56 PM
Looked at the wood దొరికితే దొంగ.. దొరక్కుంటే దొర అన్నట్టుంది కలప అక్రమ రవాణాదారుల తీరు. జిల్లాలో కలప వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్నిచోట్ల కలప అక్రమ రవాణా జరుగుతోంది. బహిరంగ మార్కెట్లో కలపకు విపరీతంగా డిమాండ్ పెరిగింది.
కలపపై కన్నేశారు
జిల్లాలో యథేచ్ఛగా అక్రమ రవాణా
టేకు, నీలగిరి, సరుగుడు చెట్లు తరలింపు
చోద్యం చూస్తున్న యంత్రాంగం
- ఎస్.కోట మండలంలోని తాటిపూడి, కృష్ణాపురం రహదారుల్లో రాత్రీపగలు తేడా లేకుండా సరుగుడు, గండ్ర, టేకు, పాచి తదితర రకాల చెట్లు ఎక్కువుగా రవాణా అవుతున్నాయి. ఇవి ఎస్.కోట, జామి మండలాల్లో ఉన్న షామిల్లులకు అధికంగా తరలిపోతున్నాయి. అరికట్టాల్సిన అటవీశాఖ పెద్దగా దృష్టిసారించడంలేదనే విమర్శలున్నాయి.
- మెంటాడ, గజపతినగరం మండలాల నుంచి రాత్రి వేళ కలప అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఒక సర్వే నెంబరు మీద కటింగ్ అర్డర్ తీసుకుని ఇతర చోట్ల కలపను కట్ చేసి తరలిస్తున్నారు. రాత్రి వేళ అధికంగా రవాణా చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు దృష్టి సారించటం లేదనే విమర్శలున్నాయి. ఈ మధ్యకాలంలో షామిల్లులపై కనీస స్థాయిలో తనిఖీలు లేవు. దీనిని అక్రమ రవాణాదారులు ఓ అవకాశంగా తీసుకుంటున్నారు.
విజయనగరం, మే 11(ఆంధ్రజ్యోతి):
దొరికితే దొంగ.. దొరక్కుంటే దొర అన్నట్టుంది కలప అక్రమ రవాణాదారుల తీరు. జిల్లాలో కలప వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్నిచోట్ల కలప అక్రమ రవాణా జరుగుతోంది. బహిరంగ మార్కెట్లో కలపకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. గృహోపకరణాలకు కలపను విరివిగా వినియోగిస్తున్నారు. దీంతో అక్రమార్కుల కన్ను కలపపై పడింది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో గుట్టుగా కలపను నరికివేస్తున్నారు. రెండో కంటికి తెలియకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏపుగా పెరిగిన భారీ వృక్షాలనే టార్గెట్ చేస్తున్నారు. ఇందుకు రాత్రివేళల్లో అధునాతన యంత్రాలను వినియోగిస్తున్నారు. తెల్లవారేసరికి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. కోట్ల రూపాయల్లో వ్యాపారాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అటవీశాఖ అధికారులు మాత్రం నిఘా పెడుతున్నామని చెబుతున్నారు కానీ గ్రామీణ, అటవీ ప్రాంతాల నుంచి కలప మాయం అవుతూనే ఉంది.
కోత యంత్రాలు, టింబర్ డిపోలు..
ముఖ్యంగా ఎస్.కోట, గజపతినగరం నియోజకవర్గంలోని అటవీ ప్రాంతాల్లో కలప కోత అధికంగా ఉంది. రాజాం నియోజకవర్గంలో సైతం కలప అక్రమ రవాణా జరుగుతోంది. ముఖ్యంగా టేకు కర్రలను ఎక్కువగా తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కలప కోత యంత్రాలు, టింబర్ డిపోలు అధికంగా ఉన్నాయి. వీటిపై అధికారుల నిఘా కొరవడింది. చాలాచోట్ల రైస్మిల్లులు కాస్త కలప కోత యంత్రాలతో టింబర్ డిపోలుగా మారిపోయాయి. ఇదో లాభసాటి వ్యాపారం కావడంతో సంబంధిత నిర్వాహకులు మార్పులు చేసుకుంటున్నారు. అయితే టింబర్ డిపోలకు వస్తున్న కలప కొంతవరకూ మాత్రమే సక్రమం. మిగతాది అక్రమంగా వస్తున్నదే. ప్రధానంగా కలప రవాణా వేకువజామున జరుగుతుంది. అటవీ శాఖ సిబ్బందితో ముందస్తు ఒప్పందం జరిగినా.. పోలీసులతో ఇబ్బందులు తప్పవు. అందుకే తెల్లవారుజాము 3, 4 గంటల నుంచి 7 గంటల్లోగానే ఈ కలప అక్రమ రవాణా పూర్తి చేస్తున్నట్లు సమాచారం.
నీలగిరి మాయం
జిల్లాలో చాలా ప్రాంతాల్లో నీలగిరి సాగు అధికం. మరోవైపు జిల్లాలో గిరిజనులు, అడవులకు అనుబంధంగా ఉన్న ప్రాంతాల నుంచి కూడా అరుదైన కలప తరలిపోతోంది. ఒడిశా దగ్గరగా ఉండడంతో అటు వైపుగా ఎక్కువగా తరలిస్తున్నారు. వాటి కోసం గిరిజనులను సమిధులుగా మార్చి మైదాన ప్రాంతాలకు తెస్తున్నారు. అక్కడ నుంచి లారీలు, కంటైనర్లలో ఇతర ప్రాంతాలకు తరలించి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. దళారులు, వ్యాపారులు కాళ్లు కదపకుండా లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా అటవీ శాఖకు కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. జిల్లాలో పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 29 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతం నుంచి నీలగిరి, సరుగుడు పెద్ద ఎత్తున తరలిపోతోంది. ఇవి తీరానికి రక్షణ కవచంలా ఉంటాయి. తీరం కోతకు గురికాకుండా కాపాడతాయి. విపత్తులు వచ్చినప్పుడు అడ్డంగా నిలుస్తాయి. వాటిపై సైతం అక్రమార్కుల కన్నుపడింది. యథేచ్ఛగా నరికివేసి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ కలప అక్రమ రవాణాపై దృష్టిపెట్టాల్సిన అవసరముంది.
Updated Date - May 11 , 2025 | 11:56 PM