సారాపై నిఘా పెట్టండి
ABN, Publish Date - May 14 , 2025 | 12:39 AM
ఉమ్మడి జిల్లాలో సారా తయారీ, అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరించాలని ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బాబ్జీరావు అధికారులను ఆదేశించారు.
విజయనగరం, మే 13 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో సారా తయారీ, అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరించాలని ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బాబ్జీరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల అధికారులతో నవోదయం 2.0పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సారా నిందితులు, అనుమానితులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సారా వల్ల కలిగే అనర్థాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ నెల 31 నాటికి విజయనగరం జిల్లా, జూన్ 30 నాటికి పార్వతీపురం మన్యం జిల్లాను సారా రహిత జిల్లాలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రామ చంద్రరావు, జిల్లా సూపరింటెండెంట్ శ్రీనాఽథుడు, ఏఈఎస్లు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - May 14 , 2025 | 12:39 AM