How does soil grow? భూసారం పెరిగేదెలా?
ABN, Publish Date - Jun 19 , 2025 | 12:08 AM
How does soil grow? జిల్లాలోని పంట భూముల్లో భూసారం తగ్గుతోందని శాస్త్రవేత్తలు అంచనావేశారు. ఈ పరిస్థితి నానాటికీ మరింత పెరుగుతోందని, ప్రధానంగా సూక్ష్మ పోషకాలు పూర్తిస్థాయిలో అందడం లేదని చెబుతున్నారు. నెల్లిమర్ల, రాజాం, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి నియోజకవర్గాల్లో భూసారం గణనీయంగా తగ్గినట్టు మట్టి పరీక్షల్లో తేలింది.
భూసారం పెరిగేదెలా?
పంట భూముల్లో అరకొరగా సూక్ష్మ పోషకాల వినియోగం
జాడలేని జింకు సల్ఫేట్, జిప్సం, బోరాన్
గత టీడీపీ హయాంలో రాయితీపై పంపిణీ
నిలిపివేసిన వైసీపీ ప్రభుత్వం
పునరుద్ధరించాలని రైతుల విన్నపం
జిల్లాలోని పంట భూముల్లో భూసారం తగ్గుతోందని శాస్త్రవేత్తలు అంచనావేశారు. ఈ పరిస్థితి నానాటికీ మరింత పెరుగుతోందని, ప్రధానంగా సూక్ష్మ పోషకాలు పూర్తిస్థాయిలో అందడం లేదని చెబుతున్నారు. నెల్లిమర్ల, రాజాం, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి నియోజకవర్గాల్లో భూసారం గణనీయంగా తగ్గినట్టు మట్టి పరీక్షల్లో తేలింది. ఈ ఏడాది 28,400 మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్ష కేంద్రాల్లో విశ్లేషించి ఆ ఫలితాలను రైతులకు అందిస్తున్నారు. సాగులో విపరీతంగా రసాయనాలు వాడడం వల్ల కూడా భూసారం తగ్గిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నెల్లిమర్ల, జూన్ 18(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మోస్తరు వర్షం పడింది. దీంతో రైతులు వరి ఆకుమడులు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఉత్తరాంధ్రలో ఇతర ప్రాంతాల్లో ఎదలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. జిల్లాలో మాత్రం వరిలో ఎద సాగుకు ఇక్కడ భూములు అనుకూలం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎదలో వరి విత్తనాలు చల్లితే కలుపు ఎక్కువగా పెరిగి పంటపై ప్రభావం చూపుతుందంటున్నారు. జిల్లాలో ఎక్కువగా సంప్రదాయ రీతిలో వరి ఆకుమడులు వేసి.. నారుతో వరి ఉబాలు చేపడ్తారు. అయితే ఈ ఏడాది భూసారం తగ్గినట్టు శాస్త్రవేత్తలు విశ్లేషించారు. గతంలో రైతులు పాడి పశువులు పెంచుకునేవారు. పేడను గత్తం రూపంలో పొలాల్లో వేసేవారు. తద్వారా భూసారం పెరిగేది. నేడు ఆ పరిస్థితి లేదు. దీనికితోడు విపరీతంగా రసాయనాలు వాడుతుండడంతో భూసారం గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. తక్షణం సూక్ష్మ పోషకాల రూపంలో ఎరువులు వేయాల్సి ఉంది.
ఆ ప్రాంతాల్లో క్షీణిస్తున్న భూసారం
నెల్లిమర్ల, రాజాం, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి నియోజకవర్గాల్లో భూసారం గణనీయంగా తగ్గినట్టు పరీక్షల్లో తేలింది. సాగులో భాగంగా విపరీతంగా రసాయనాలు వాడడం వల్ల భూసారం తగ్గిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా జింకు లోపం ఉన్నట్టు గుర్తించారు. జింకు సల్ఫేటు వాడాలని సూచిస్తున్నారు. కేవలం జింకు లోపం వల్లే గత ఏడాది వరికి సంబంధించి ఎకరాలకు మూడు క్వింటాళ్ల దిగుబడులు తగ్గాయని చెబుతున్నారు. కాగా వరికి సంబంధించి ముందస్తు దుక్కులు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే దుక్కిలో జింకు సల్ఫేటు వేసుకుంటే మంచిది. కానీ ఈ ఏడాది ఇంతవరకూ జింకు సల్ఫేటు రైతు సేవా కేంద్రాలకు చేరుకోలేదు. దీంతో రైతులు నిరాశ పడుతున్నారు.
గతంలో రాయితీపై...
జిల్లాలో ఖరీఫ్లో భాగంగా వరి, మొక్కజొన్న వేరుశనగ, పత్తి, ఇతర నూనె పంటలు పండిస్తారు. మొత్తం 1.16 లక్షల హెక్టార్లలో పంటలు సాగుచేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2014 నుంచి 2019 వరకూ పొలంలో సూక్ష్మ పోషకాలను పెంచే జింకు సల్ఫేటు, జిప్సం, బోరాన్ వంటివి రాయితీపై అందించేవారు. ఖరీఫ్, రబీ సీజన్లలో ముందుగానే తెప్పించి రైతులకు అందించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాయితీకి మంగళం పాడేసింది. సరఫరాను నిలిపివేసింది. దీంతో రైతులు అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేయాల్సి వచ్చేది. గత ఏడాది 20 కిలోల జింకు సల్ఫేటు రూ.1200గా ఉండేది. ఈ ఏడాది రూ.1300కు చేరుకుంది. ప్రధానంగా వేరుశనగ సాగులో జింకు సల్ఫేటు వాడకం తప్పనిసరి. వాడకపోతే దిగుబడి తగ్గిపోతుంది. వరి విషయంలోనూ అదే పరిస్థితి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సూక్ష్మ పోషకాలు పెంచే ఎరువులను రాయితీపై అందిస్తామని ప్రకటించింది కానీ ఇంతవరకూ కార్యాచరణ ప్రారంభం కాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
వచ్చిన వెంటనే అందిస్తాం..
ఖరీఫ్లో జింకు సల్ఫేట్, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలు అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. అయితే ఇంతవరకూ అవి చేరుకోలేదు. వచ్చిన వెంటనే రాయితీపై రైతులకు అందిస్తాం. రైతులకు వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. సద్వినియగం చేసుకోవాలి. ఎరువుల విషయంలో కొరత లేకుండా చూస్తాం.
- వీటి రామారావు, వ్యవసాయశాఖ అధికారి, విజయనగరం
----------------------
Updated Date - Jun 19 , 2025 | 12:08 AM