Yoga యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ABN, Publish Date - May 30 , 2025 | 11:28 PM
Holistic Health Through Yoga యోగాసనాలతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. శుక్రవారం తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని కుడి మట్టికట్ట ప్రాంతంలో యోగాంధ్ర నిర్వహించారు. ఈ సందర్భంగా 1500 మంది వివిధ రకాల ఆసనాలు వేశారు.
తోటపల్లిలో యోగాంధ్ర నిర్వహణ
గరుగుబిల్లి, మే 30 (ఆంధ్రజ్యోతి): యోగాసనాలతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. శుక్రవారం తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని కుడి మట్టికట్ట ప్రాంతంలో యోగాంధ్ర నిర్వహించారు. ఈ సందర్భంగా 1500 మంది వివిధ రకాల ఆసనాలు వేశారు. కలెక్టర్ శిక్షకునిలా మారి పలువురితో యోగా చేయించారు. మొత్తంగా యోగా నిర్వాహకులతో తోటపల్లి ప్రాజెక్టు ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లాలోని 15 మండలాలు, పట్టణాల్లో యోగా శిక్షణ కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా తోటపల్లి ప్రాంతం సుందరీకరణకు చర్యలు చేపడుతున్నామన్నారు. బోటు షికారు, మట్టికట్ట ఆధునికీకరణ, ఐటీడీఏ పార్కు ప్రాంతంతో పాటు రహదారికి ఆనుకుని ఖాళీ ప్రాంతాలను చదును చేయిస్తామని తెలిపారు. పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. యోగా నిత్య అలవాటుగా మార్చుకోవాలన్నారు. చాలామంది యువత ఇంటర్నెట్లో మునుగుతున్నారన్నారు. వ్యాయామం లేకపోవడంతో పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. యోగాతో వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందన్నారు. ప్రతి కుటుంబంలో యోగం భాగం కావాలన్నారు.
Updated Date - May 30 , 2025 | 11:28 PM