CRT Renewals సీఆర్టీల రెన్యూవల్కు గ్రీన్ సిగ్నల్
ABN, Publish Date - Jun 25 , 2025 | 11:22 PM
Green signal for CRT Renewals జిల్లాలో జీపీఎస్ పాఠశాలలకు ఉపాధ్యాయుల కొరత తీరింది. మొత్తంగా 284 మంది సీఆర్టీల (ఒప్పంద ఉపాధ్యాయులు)ను రెన్యూవల్ చేస్తూ గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం.గౌతమి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో 9 మంది, శ్రీకాకుళం జిల్లాలో 121 మంది సీఆర్టీలను రెన్యూవల్ చేశారు.
సాలూరు రూరల్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి ): జిల్లాలో జీపీఎస్ పాఠశాలలకు ఉపాధ్యాయుల కొరత తీరింది. మొత్తంగా 284 మంది సీఆర్టీల (ఒప్పంద ఉపాధ్యాయులు)ను రెన్యూవల్ చేస్తూ గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం.గౌతమి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో 9 మంది, శ్రీకాకుళం జిల్లాలో 121 మంది సీఆర్టీలను రెన్యూవల్ చేశారు. మన్యం జిల్లాలో రెన్యూవల్ చేసిన 284 మందిని తొలుత జీపీ పాఠశాలలకు బదిలీ చేయనున్నారు. మిగిలిన వారిని ఆశ్రమ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లుగా పంపనున్నారు. వీరి రెన్యూవల్తో జీపీఎస్, ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొరత తీరనుంది. వాస్తవంగా మన్యం జిల్లాలో 451 జీపీ పాఠశాలలున్నాయి. అవన్నీ దాదాపుగా ఏకోపాధ్యాయులతో నడుస్తున్నాయి. వాటిలో దాదాపు వందకు పైగా పాఠశాలలను గత విద్యా సంవత్సరం సీఆర్టీలతో నిర్వహించారు. ఈ ఏడాది సీఆర్టీలకు రెన్యూవల్ ఆదేశాలు రాకపోవడంతో సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఆయా జీపీ పాఠశాలలు ఈ నెల 12న తెరుచుకోలేదు. ఈ విషయం అధికారులు దృష్టికి రావడంతో ఈ నెల 23 నుంచి అన్ని పాఠశాలలు పనిచేసే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
రెండు రోజుల్లో కౌన్సిలింగ్
జిల్లాలో సీఆర్టీలను రెన్యూవల్ చేస్తు ఈ రోజు ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు వారి సీనియార్టీ జాబితాలను తయారు చేయాల్సి ఉంది. వారికి సమాచారం ఇవ్వాల్సి ఉంది. రెండు రోజుల్లో కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలలను కేటాయిస్తాం. ప్రస్తుతం ఏ పాఠశాల మూతబడకుండా చర్యలు తీసుకున్నాం.
- ఆర్.కృష్ణవేణి, గిరిజన సంక్షేమశాఖ డీడీ, పార్వతీపురం ఐటీడీఏ
Updated Date - Jun 25 , 2025 | 11:22 PM