Every Promise Will Be Fulfilled ప్రతి హామీ నెరవేరుస్తాం
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:07 AM
Every Promise Will Be Fulfilled ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారని, ఇది చేతల ప్రభుత్వమని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇటిక గ్రామంలో సంబరాలు నిర్వహించారు.
వైసీపీ బూటకపు మాటలను ప్రజలు నమ్మరు
ఏడాది పాలన సంబరాల్లో ప్రభుత్వ విప్ జగదీశ్వరి
జియ్యమ్మవలస, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారని, ఇది చేతల ప్రభుత్వమని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇటిక గ్రామంలో సంబరాలు నిర్వహించారు. ముందుగా గ్రామంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆమె కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘ వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం మచ్చుకైనా కనిపించలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రోడ్లు నిర్మించి అభివృద్ధికి బాటలు వేసింది. పింఛన్లు ఒకేసారి రూ.4 వేలకు పెంచుతూ ప్రతినెలా ఒకటో తేదీకే అందేలా చూస్తోంది. వైసీపీ అనాలోచిత నిర్ణయాల వల్ల దెబ్బతిన్న రాష్ర్టాన్ని, అన్ని వ్యవస్థలను సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారు. వైసీపీ నాయకుల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొంగు సురేష్, నాయకులు కృష్ణబాబు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
వెన్నుపోటుకు కేరాఫ్ జగన్
పార్వతీపురం, జూన్ 4(ఆంధ్రజ్యోతి): వెన్నుపోటుకు కేరాఫ్ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలం వెంకంపేటలోని టీడీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి విజయచంద్రకు తినిపించారు. అనంతరం ఎమ్మెల్యే విలేఖర్లతో మాట్లాడుతూ..‘ ప్రజా తీర్పునకు ఏడాడి పూర్తయింది. అన్ని వర్గాల వారు వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించారు. మరి ఇదే రోజున ఆ పార్టీ వెన్నుపోటు పేరిట నిరసన తెలపడం హాస్యాస్పదంగా ఉంది. జగన్కు ప్రజాస్వామ్యంపై ఎటువంటి ఆలోచన ఉందో ఈ కార్యక్రమం ద్వారా అందరికీ అర్థమవుతుంది. గత ఐదేళ్లూ అన్ని సామాజిక వర్గాలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగనే. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ఎంతో అభివృద్ధిని సాధించాం.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటనాయుడు, దేవిచంద్రమౌళి, వేణు, వెంకటరమణ, జి.రవికుమార్, గౌరునాయుడు తదితరులు పాల్గొన్నారు.
- కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయాలు, వివిధ కూడళ్లలో విజయోత్సవాలు జరిపారు. కేక్లు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. మరికొందరు మిఠాయిలు పంచి పెట్టారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం
పాలకొండ, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. బుధవారం రాత్రి పట్టణంలోని గొల్లవీధి కూడలి వద్ద కొవ్వొత్తులు, బాణాసంచా వెలిగించి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ప్రజలు అరాచక పాలనకు ముగింపు పలికి ఏడాది అయిందన్నారు. కూటమి ప్రభుత్వ చొరవతో పాలకొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.
- జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో పెద్దమంగళాపురం, చిన్న మంగళాపురం గ్రామాల్లో భారీ స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందించారు.
Updated Date - Jun 05 , 2025 | 12:07 AM