రైలు కింద పడి వృద్ధుడి ఆత్మహత్య
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:08 AM
గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్తవలస రైల్వే స్టేషన్ సమీపంలో లో ఆదివారం జరిగింది.
కొత్తవలస, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్తవలస రైల్వే స్టేషన్ సమీపంలో లో ఆదివారం జరిగింది. ఇందుకు సంబంధించి జీఆర్పీ ఎస్ఐ బాలాజీరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట సమీపం సింహపురికాలనీలో నివాసం ఉంటున్న చొప్ప సీతారామయ్య (78) ఆరోగ్య సమస్యలు కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. మృతుడు సీతారామయ్య భార్య నాలుగు సంవత్సరాల కిందట మృతి చెందడంతో తన కుమారుడు వద్ద సింహపురికాలనీలో నివాసం ఉంటున్నాడు. గత కొద్దిరోజులుగా సీతారామయ్య తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో విరక్తి చెందిన సీతారామయ్య ఆదివారం ఉదయం సింహపురి కాలనీ నుంచి కొత్తవలస సిటీ బస్సులో వచ్చి జంక్షన్లో దిగాడు. అక్కడ నుంచి కొత్తవలస రైల్వే స్టేషన్కు నడుచుకుంటూ వెళ్లి రైల్వేస్టేషన్ నుంచి కొద్ది దూరం రైలు పట్టాలపై నడుచుకుని వెళ్లి ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు కింద పడిపోవడంతో అక్కడక్కడే మృతి చెందాడు. మృతుడు సమాచారాన్ని జీఆర్పీ పోలీసులకు స్థానిక స్టేషన్ మాస్టారు ఇవ్వడంతో జీఆర్పీ పోలీసులుంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన చేశారు. మృతుడు జేబులో లేఖ ఉంది. తన చావుకు ఎవరూ కారణం కాదని, తాను ఆరోగ్య సమస్యలు కారణంగానే మృతి చెందినట్టు రాసుకున్నాడు. మృతుడి జేబులో ఆధార్ కార్డులో వివరాలను గుర్తించి మృతుడి కుమారుడికి సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - Jul 07 , 2025 | 12:08 AM