డెంకాడ టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
ABN, Publish Date - Jun 28 , 2025 | 12:42 AM
డెంకాడ మండలంలోని తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. గత కొంతకాలంగా కొనసాగుతున్న వర్గ విభేదాలు శుక్రవారం పరిశీలకుడు కనకల మురళీమోహన్ సమక్షంలో బయటపడ్డాయి.
డెంకాడ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): డెంకాడ మండలంలోని తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. గత కొంతకాలంగా కొనసాగుతున్న వర్గ విభేదాలు శుక్రవారం పరిశీలకుడు కనకల మురళీమోహన్ సమక్షంలో బయటపడ్డాయి. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన గ్రామ కమిటీ ఎన్నికల్లో 26 గ్రామ కమిటీలకు 19 గ్రామ కమిటీల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. డెంకాడ, పెదతాడివాడ, సింగవరం, మోదవలస, చింతలవలస, డి.కొల్లాం, బొడ్డువలస గ్రామాలకు సంబంధించి అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికల విషయంలో మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్, మాజీ జడ్పీటీసీ పతివాడ అప్పలనారాయణ వర్గాల నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే నెట్టుకుంటూ... గలాటాకు దిగారు. దీంతో నెల్లిమర్ల పార్టీ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు, పరిశీలకుడు కనకల మురళీమోహన్, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్లు మిగిలిన ఏడు గ్రామ కమిటీ ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పల్లె భాస్కరరావు, ఫాణిరాజు, ప్రదీప్రాజు, విద్యాసాగరనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 28 , 2025 | 12:42 AM