డయేరియా మరణాలు సంభవించకూడదు
ABN, Publish Date - Jul 25 , 2025 | 11:46 PM
డయేరియాతో బాధపడుతున్న వారిని గుర్తించి తక్షణమే వైద్య సేవలు అందించాలని, ఐదేళ్ల లోపు వయసు గల పిల్లల్లో డయేరియా మరణాలు సంభవించకుండా చూడాలని ఇన్చార్జి కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు.
- ఇన్చార్జి కలెక్టర్ సేతు మాధవన్
విజయనగరం కలెక్టరేట్, జూలై 25(ఆంధ్రజ్యోతి): డయేరియాతో బాధపడుతున్న వారిని గుర్తించి తక్షణమే వైద్య సేవలు అందించాలని, ఐదేళ్ల లోపు వయసు గల పిల్లల్లో డయేరియా మరణాలు సంభవించకుండా చూడాలని ఇన్చార్జి కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. శుక్రవారం తన చాంబర్లో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టాప్ డయేరియా పేరుతో ఈ నెల 31 వరకూ జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘డయేరియా కేసులను గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలి. తాగునీటిని క్లోరినేషన్ చేయాలి. ట్యాంకులను శుభ్రం చేయాలి. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు వేడి ఆహారం పెట్టాలి. టెస్ట్ కిట్లు, మందులను అన్ని ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంచాలి. అతిసారంపై ఇంటింటా సర్వే చేపట్టాలి. జింక్ మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇంటింటికీ అందేలా చూడాలి. డయేరియాపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి. ఆగస్టు తర్వాత జిల్లాలో డయేరియా కేసులు పూర్తిగా తగ్గాలి.’ అని అన్నారు. అనంతరం అతిసార వ్యాధి నుంచి మీ పిల్లలను రక్షించండి అనేక కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్వో జీవరాణి, డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణి, డీఐవో అచ్యుతకుమారి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 25 , 2025 | 11:46 PM