Cooking is easy వంట ఇక ఈజీ
ABN, Publish Date - Aug 04 , 2025 | 12:12 AM
Cooking is easyప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు ఎలక్ర్టిక్ ఇండక్షన్ స్టవ్లు అందిస్తోంది. ఈ కేంద్రాల్లోని చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. వారితో పాటు గర్భిణులు, బాలింతలకు సైతం పౌష్టికాహారం అందిస్తున్నారు. గతంలో కట్టెల పొయ్యిపై వంట చేసేవారు.
వంట ఇక ఈజీ
అంగన్వాడీ కేంద్రాలకు ఎలక్ర్టిక్ స్టవ్లు
వంటపాత్రలు సైతం
జిల్లా వ్యాప్తంగా పంపిణీ ప్రారంభం
రాజాం, జూలై 2 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు ఎలక్ర్టిక్ ఇండక్షన్ స్టవ్లు అందిస్తోంది. ఈ కేంద్రాల్లోని చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. వారితో పాటు గర్భిణులు, బాలింతలకు సైతం పౌష్టికాహారం అందిస్తున్నారు. గతంలో కట్టెల పొయ్యిపై వంట చేసేవారు. తరువాత గ్యాస్ కనెక్షన్లు అందించారు. సకాలంలో గ్యాస్ పంపిణీ కాకపోవడం, గ్యాస్ బిల్లులు చెల్లించకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో విసిగి అంగన్వాడీ సిబ్బంది మళ్లీ కట్టెల పొయ్యిపై ఆహారాన్ని తయారుచేస్తున్న ఘటనలు కోకొల్లలు. ఆ అవస్థలకు చెక్ పెడుతూ ప్రభుత్వం నేరుగా ఇండక్షన్ స్టవ్లు అందిస్తోంది. వాటితో పాటు కుక్కర్లు, ఇతర పాత్రలు కూడా పంపిణీ చేస్తోంది.
జిల్లా ఐసీడీఎస్లో 11 ప్రాజెక్టులు ఉండగా వాటి పరిధిలో 2,206 ప్రధాన, 293 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 64 వేల మంది చిన్నారులు పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. వారికి విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలి. గతంలో కట్టెల పొయ్యి మీద తయారు చేసేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి కేంద్రానికీ గ్యాస్ కనెక్షన్ మంజూరు చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఐసీడీఎస్ వ్యవస్థపై నిర్లక్ష్యం కొనసాగింది. గ్యాస్ సిలిండర్లకు సంబంధించి నెలల తరబడి బిల్లలు పెండింగ్లో ఉండిపోయాయి. వీటికితోడు గ్యాస్ పంపిణీలో కూడా జాప్యం జరిగింది. ఈ కారణంగా పౌష్టికాహారం తయారీలో ఇబ్బందులు ఎదురయ్యేవి. వీటి పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ఎలక్ర్టిక్ ఇండక్షన్ స్టవ్లు అందించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పంపిణీ ప్రారంభించింది. వీలైనంత త్వరగా అన్ని కేంద్రాలకు అందించేందుకు ఐసీడీఎస్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పప్పు కోసం కుక్కర్లు..
అంగన్వాడీ కేంద్రాలకు అందిస్తున్న కందిపప్పు నాణ్యతపై ఎప్పటి నుంచో ఫిర్యాదులు ఉన్నాయి. కందిపప్పు ఉడకడం చాలా కష్టమని అంగన్వాడీ సహాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇండక్షన్ స్టవ్తో పాటు కుక్కర్లు సైతం అందిస్తున్నారు. ఈ స్టవ్ల వినియోగంపై సంబంధిత కంపెనీ ప్రతినిధులతో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కూడా ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ల సమస్యపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లడంతో ఇండక్షన్ ఎలక్ర్టిక్ స్టవ్లను అందించింది. ఇప్పటికి విజయనగరం డివిజన్లో 250, బొబ్బిలి డివిజన్లో 250, చీపురుపల్లి డివిజన్లో 200 వరకు స్టవ్లు అందించినట్టు ఐసీడీఎస్ వర్గాలు చెబుతున్నాయి.
పూర్తిస్థాయిలో పంపిణీ
జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ ఎలక్ర్టిక్ స్టవ్లు అందించే ఏర్పాట్లు చేశాం. గ్యాస్ సిలిండర్లకు సంబంధించి పంపిణీలో జాప్యం, బిల్లుల చెల్లింపుల్లో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం ఎలక్ర్టిక్ స్టవ్లు అందించేందుకు నిర్ణయించింది. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వీటి పంపిణీ దాదాపు పూర్తయ్యింది.
- విమలారాణి, ఐసీడీఎస్ పీడీ, విజయనగరం
----------
Updated Date - Aug 04 , 2025 | 12:12 AM