తారకరామ రిజర్వాయర్ డిజైన్ మార్చండి
ABN, Publish Date - Jun 20 , 2025 | 11:53 PM
తారకరామ తీర్థసాగర్ రిజర్వాయర్ పనులను సారిపల్లి గ్రామస్థులు మరోసారి అడ్డుకున్నారు.
గట్లను కొండకు కలపొద్దు
పనులను అడ్డుకున్న సారిపల్లి గ్రామస్థులు
యంత్రాలతో వెనుదిరిగిన నిర్మాణ సిబ్బంది
నెల్లిమర్ల, జూన్ 20(ఆంధ్రజ్యోతి): తారకరామ తీర్థసాగర్ రిజర్వాయర్ పనులను సారిపల్లి గ్రామస్థులు మరోసారి అడ్డుకున్నారు. గట్లను కొండకు కలప వద్దని, ఆ డిజైన్ను మార్పు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో యంత్రాలతో నిర్మాణ సిబ్బంది వెనుదిరిగారు. సారిపల్లి గ్రామ ముఖద్వారం వద్ద ఉన్న కొండకు రిజర్వాయర్ ఉత్తర, తూర్పు గట్లను కలిపే లక్ష్యంతో నిర్మాణ విభాగం సిబ్బంది యంత్రాలతో శుక్రవారం ఉదయం వచ్చారు. విషయం తెలుసుకున్న వందలాది మంది గ్రామస్థులు, పలువురు గ్రామ పెద్దలు అక్కడకు చేరుకొని పనులు జరగకుండా అడ్డుకున్నారు. పనులు కొనసాగితే గ్రామంలోకి తాము ప్రవేశించే రోడ్డు మూతపడే పరిస్థితి వస్తుందన్నారు. డిజైన్ను మార్పు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నిర్మించిన తూర్పు, ఉత్తర గట్లను కలిపితే తమకు అభ్యంతరం లేదని, అయితే ఈ రెండు గట్లను కొండకు కలిపితే తమ గ్రామంలోకి ప్రవేశించే మార్గాలు మూతపడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గట్లను కలిపే డిజైన్ మార్పు చేయాలని ముందునుంచే కోరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గట్లను కొండకు కలిపితే తమ గ్రామ భూగోళిక స్వరూపం మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక యంత్రాలతో సైతం నిర్మాణ సిబ్బంది వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బోనుమహంతి ఆదినారాయణ, సారిపల్లి బాబూరావుతోపాటు అధిక సంఖ్యలో గ్రామస్థులు, ఉపాధి వేతనదారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 11:53 PM