ఇంజనీరింగ్ శాఖలో కుర్చీలాట
ABN, Publish Date - Jun 27 , 2025 | 12:05 AM
సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖలో ఈఈ పోస్టుపై కుర్చీలాట చోటుచేసుకుంది.
- నేనే ఈఈ అంటున్న కుమార్
- కాదు నేను అంటున్న రమాదేవి
- చాంబర్లో వేర్వేరుగా కుర్చీలేసి కూర్చున్న వైనం
-పీవో చొరవతో సద్దుమణిగిన వివాదం
- కుమార్కే దక్కిన అవకాశం
సీతంపేట రూరల్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖలో ఈఈ పోస్టుపై కుర్చీలాట చోటుచేసుకుంది. ప్రభుత్వం తననే ఈఈగా నియమించిందంటూ ఓ అధికారి అంటే, కాదు కోర్టు ఉత్తర్వుల మేరకు తానే ఈఈగా కొనసాగుతానంటూ మరో అధికారి అనడం వివాదానికి దారి తీసింది. ఇద్దరు అధికారులు కూడా ఈఈ చాంబర్లో వేర్వేరుగా కుర్చీలేసి కూర్చున్నారు. దీంతో ఎవరు ఈఈ అనేది తెలియక సిబ్బంది ఇబ్బంది పడ్డారు. అయితే, ఐటీడీఏ పీవో చొరవతో ఈ సమస్య పరిష్కారమైంది. ఈఈగా కేవీఎస్ఎన్ కుమార్నే కొనసాగించారు.
ఏం జరిగిందంటే..
సీతంపేట ఇంజనీరింగ్ శాఖకు ఈఈగా కేవీఎస్ఎన్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఈనెల 9న జీవో జారీ చేసింది. ఇక్కడ ఈఈగా పనిచేస్తున్న పి.రమాదేవిని నెల్లూరు ఐటీడీఏకు బదిలీ చేసింది. ప్రభుత్వ జీవో ప్రాప్తికి కుమార్ ఈనెల 11న సీతంపేట ఈఈగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో రమాదేవి సెలవుపై ఉన్నారు. విధి నిర్వహణలో భాగంగా కుమార్ ఢిల్లీ వెళ్లారు. అయితే, తన బదిలీని సవాల్ చేస్తూ రమాదేవి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తానే సీతంపేట ఈఈగా కొనసాగుతానంటూ ఈనెల 18న కార్యాలయానికి వచ్చి రమాదేవి సీట్లో కూర్చున్నారు. ఇంతలో ఢిల్లీ వెళ్లిన కుమార్ గురువారం తిరిగి సీతంపేట ఇంజనీరింగ్శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో రమాదేవి, కుమార్ మధ్య కుర్చీలాట మొదలయ్యింది. వీరిద్దరూ ఈఈ గదిలో వేరువేరు కుర్చీల్లో ఆసీనులయ్యారు. దీంతో ఎవరూ తమ ఈఈ అనేదానిపై కార్యాలయ సిబ్బందిలో సందిగ్ధత నెలకొంది. చివరకు ఈ పంచాయితీ ఐటీడీఏ పీవో సి.యశ్వంత్కుమార్రెడ్డి వద్దకు చేరింది. ఆయన చొరవ తీసుకొని ఈఈలు ఇరువురితో మాట్లాడారు. అనంతరం ఈ అంశాన్ని రాష్ట్ర గిరిజనసంక్షేమశాఖ ఉన్నతాధికారుల దృష్టికి పీవో తీసుకువెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సీతంపేట ఈఈగా కుమారే కొనసాగుతారని పీవో స్పష్టం చేశారు. ఏమైనా చెప్పాలనుకుంటే గిరిజనసంక్షేమశాఖ ఉన్నతాధికారులను సంప్రదించాలని రమాదేవికి ఆయన సూచించారు. దీనిపై ఈఈ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తాను ఈఈగా కొనసాగుతున్నానని, ఇందులో వివాదం ఏముందని సమాధానం ఇచ్చారు.
Updated Date - Jun 27 , 2025 | 12:05 AM