Cancer కబళిస్తున్న క్యాన్సర్
ABN, Publish Date - Jul 02 , 2025 | 11:18 PM
Cancer Devouring Lives జిల్లాలో కొమరాడ మండలంలోని గంగిరేగువలస, రాజ్యలక్ష్మీపురం పంచాయతీలను క్యాన్సర్ కబళిస్తోంది. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగు తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 12 మంది మృత్యువాత పడ్డారు. మరో 14 మంది చికిత్స పొందుతున్నారు.
ఇంతవరకు 12 మంది మృత్యువాత
చికిత్స పొందుతున్న మరో 14 మంది
పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేస్తే.. మరింత పెరగనున్న బాధితుల సంఖ్య
వ్యాధి ప్రబలడానికి కారణాలేమిటో తెలియని వైనం
ఆందోళనలో గ్రామస్థులు
ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని విన్నపం
జియ్యమ్మవలస, జూలై2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొమరాడ మండలంలోని గంగిరేగువలస, రాజ్యలక్ష్మీపురం పంచాయతీలను క్యాన్సర్ కబళిస్తోంది. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగు తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 12 మంది మృత్యువాత పడ్డారు. మరో 14 మంది చికిత్స పొందుతున్నారు. పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేస్తే బాధితుల సంఖ్య మరింత పెరగనుంది. కాగా గ్రామాల్లో ఒకరి తర్వాత ఒకరు క్యాన్సర్ బారిన పడుతుండడంతో ఎప్పుడు ఎవరు బలైపోతారో అన్న భయం గ్రామస్థులను మరింత కుంగదీస్తోంది. వైద్యాధికారులు సర్వే చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. అసలు ఆ రెండు పంచాయతీల్లోనే క్యాన్సర్ ప్రబలడానికి గల కారణాలను ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
ఇదీ పరిస్థితి..
- కొమరాడ మండలం గంగిరేగువలస పంచాయతీ పరిధిలో చినగంగిరేగువలస, స్వామినాయుడువలస, గంగిరేగువలస గ్రామాల్లో క్యాన్సర్ కారణంగా గత పదేళ్లలో పది మంది వరకు చనిపోయారు. వారిలో దొనక మురళీ (24), దీసరి కళావతి (42), అజ్జాడ లక్ష్మి (45), ద్వారపురెడ్డి గౌరునాయుడు (45), రావాడ గంగమ్మ (45), కోడి మన్మధరావు (48), బగ్గం కళ్యాణి (50), గంగునాయుని చిన్నమ్ముడు (50), దత్తి ఆదినారాయణ (50), దీసరి చిన్నమ్మి (60)లు ఉన్నారు. ఆ పంచాయతీకి చెందిన గుంట్రెడ్డి ఉమామహేశ్వరరావు, మరిశర్ల మహాలక్ష్మి, కర్రి గౌరమ్మ, బూడిద అనిల్, గంట చిన్నమ్మలు, గుడ్లె హేమలత, డొంకాడ సత్యం, ఏగిరెడ్డి పద్మ, దాసరి లక్ష్మమ్మ, కేతిరెడ్డి వసంత, డొంకాడ సత్యవతిలు కాన్సర్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
- కంబవలస పంచాయతీ రాజ్యలక్ష్మీపురంలో క్యాన్సర్ బారిన పడి గత రెండేళ్లలో ఇద్దరు చనిపోయారు. బర్ల శ్రీను, నాలి కాళి మృత్యువాత పడగా.. పొట్నూరు రాము, బొట్ట సూరప్పమ్మ, బొట్ట లక్ష్మి, బొట్ట సుమతి క్యాన్సర్ చికిత్స పొందుతున్నారు.
ఆ ఫ్యాక్టరీయే కారణమా?
గంగిరేగువలస, చినగంగిరేగువలస, స్వామినాయుడువలస, రాజ్యలక్ష్మీపురం గ్రామ ప్రజలే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఓ ఫ్యాక్టరీ వల్లే వ్యాధి ప్రబలుతుందని ఆయా ప్రాంతవాసులు భావిస్తున్నారు. కాగా ఈ సమస్యను వారు గతంలో చాలాసార్లు కలెక్టరేట్ గ్రీవెన్స్ దృష్టికి తీసుకెళ్లినా.. ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఇప్పటివరకు ప్రజాప్రతినిధులు, అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల్లో సర్వే చేసి తగు చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ బాధితుల సంఖ్య పెరుగుతుండడం గ్రామస్థులను కలవరపెడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కారణాలు ఏమిటో తేల్చాలి
కొమరాడ మండలంలో గంగిరేగువలస, రాజ్యలక్ష్మీపురంలో క్యాన్సర్ ప్రబలుతుండడం ఆందోళన కలిగించే విషయం. స్పెషలిస్టుల బృందం గ్రామాలకు వచ్చి క్యాన్సర్ ప్రబలడానికి గల కారణాలేమిటో నిగ్గు తేల్చాలి.
- నంగిరెడ్డి మధుసూదనరావు, టీడీపీ నేత, రాజ్యలక్ష్మీపురం
==============================================
విచారణ జరపాలి..
మా గ్రామాల్లో క్యాన్సర్ వ్యాప్తి చెందడానికి కారణం ఓ ఫ్యాక్టరీయే అని భావిస్తున్నాం. దీనిపై విచారణ చేసి వాస్తవాలు బయటకు తేవాలి.
- జి.వెంకటనాయుడు, ఎంపీటీసీ సభ్యుడు, గంగిరేగువలస
================================================
పరిహారమివ్వాలి
క్యాన్సర్తో మరణించి వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎటువంటి ఆధారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి.
- కె.సాంబమూర్తి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు
==================================================
పర్యవేక్షిస్తున్నాం
కొమరాడ మండల పరిధిలో గంగిరేగువలస, చినగంగిరేగువలస, స్వామినాయుడువలస, రాజ్యలక్ష్మీపురం గ్రామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్నాం.
- టి.జగన్మోహనరావు, జిల్లా సమన్వయకర్త, ఎన్సీడీ అండ్ ఆర్బీఎస్కే విభాగం
Updated Date - Jul 02 , 2025 | 11:18 PM