Aadhaar బాలలందరికీ ‘ఆధార్’
ABN, Publish Date - Apr 29 , 2025 | 11:17 PM
Aadhaar for All Children జిల్లాలో బాలలందరికీ మే నెలాఖరుకు ఆధార్ కార్డులు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ శోభిక ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జాయింట్ కలెక్టర్ శోభిక
పార్వతీపురం, ఏప్రిల్ 29 (ఆంరఽధజ్యోతి): జిల్లాలో బాలలందరికీ మే నెలాఖరుకు ఆధార్ కార్డులు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ శోభిక ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 0-6 ఏళ్ల లోపు వయసున్న బాలలు 3,743 మంది ఉన్నారు. వారికి జనన ధ్రువీకరణ పత్రాలు లేనందున ఆధార్కార్డులు మంజూరు కాలేదు. తక్షణమే వారికి ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి. ఇందుకోసం వారి జాబితాను ఆయా మండలాలకు పంపించాం. పాచిపెంటలో 989, కురుపాంలో 434, గుమ్మలక్ష్మీపురంలో 277, మక్కువ, సాలూరు, సీతంపేట తదితర ప్రాంతాల్లో అధికంగా జనన ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. సంబంధిత అధికారులు వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. పిల్లల జనన వివరాలు సంబంధిత అంగన్వాడీ కేంద్రాల్లో ఉంటాయి. వాటి ఆధారంగా పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు పిల్లల గృహాలకు వెళ్లి తల్లిదండ్రుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి. ఈ ప్రక్రియ మే 2 నాటికి పూర్తి కావాలి. నిర్దేశించిన సమయానికి ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలి. డిజిటల్ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు దరఖాస్తులను నమోదు చేయాలి. మే 18లోగా జనన ధ్రువీకరణ పత్రాలు మంజూరయ్యేలా తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఆధార్ సిబ్బంది ఆయా మండలాల్లో ప్రత్యేక క్యాంప్లను నిర్వహించి బాలలందరికీ ఆధార్ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు. మే నెలాఖరుకు జిల్లాలోని 3,743 మంది బాలలకు ఆధార్కార్డులు మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలి. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఒకటో తేదీ ఉదయానికే లబ్ధిదారులందరికీ అందించాలి. ఇందుకు సబంధించిన నగదును ఏప్రిల్ 30 నాటికి సిద్ధం చేసుకోవాలి. గృహాలు, నీటి పన్ను, రీసర్వే తదితర అంశాలపైనా దృష్టి సారించాలి. ఈ సమావేశంలో పాలకొండ సబ్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి, డీఆర్వో కె.హేమలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Apr 29 , 2025 | 11:17 PM