A Pit That Took a Life ఊపిరి తీసిన గుంత
ABN, Publish Date - Jun 17 , 2025 | 12:14 AM
A Pit That Took a Life కురుపాం మండలం బొడ్డమానుగూడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటుకల తయారీ మట్టి కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరి గిరిజన విద్యార్థినులు మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రవుతున్నారు.
చేపలు పట్టేందుకు దిగి.. తిరిగిరాని లోకాలకు..
శోక సంద్రంలో బొడ్డమానుగూడ
కురుపాం రూరల్, 16 జూన్, (ఆంధ్రజ్యోతి): కురుపాం మండలం బొడ్డమానుగూడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటుకల తయారీ మట్టి కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరి గిరిజన విద్యార్థినులు మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రవుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బొడ్డమానుగూడకు చెందిన మండంగి జెస్సిక(12), బిడ్డిక సునంద(10)లు లంకాజోడు గిరిజన సంక్షేమ ఆశ్రమ స్కూల్లో చదువుతున్నారు. పాఠశాల పునఃప్రారంభమైనా వారింకా వెళ్లలేదు. అయితే రోజూలానే వారు సోమవారం కూడా కలిసి ఆడుకున్నారు. అయితే చేపలు పట్టేందుకని వారికి సమీపంలో ఉన్న ఇటుకల తయారీ మట్టి కోసం తవ్విన గుంతలోకి దిగారు. అందులోని బురదలో చిక్కుకుని ఊపిరాడక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అచేతనంగా పడి ఉన్న విద్యార్థినులను బయటకు తీసి మొండెంఖల్ పీహెచ్సీకి తరలించారు. అయితే అప్పటికే బాలికలు మరణించినట్టు వైద్యురాలు ప్రజ్ఞ తెలిపారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు భోరున విలపించారు. అంతవరకు సరదాగా కలిసి ఆడుకున్న వారు విగతజీవులుగా మారడం చూసి గుండెలవిసేలా రోదించారు. మరోవైపు హెచ్ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు మొండెంఖల్ ఆసుపత్రికి చేరుకున్నారు. బాలికల మృతదేహాలను చూసి తోటి విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా రామదాస్, మేరీలకు జెస్సిక ప్రథమ సంతానం. అదే గ్రామానికి చెందిన నవీన్, సుభాషిణిలకు సునంద మూడో సంతానం. పోడు వ్యవసాయం చేసుకుని వారు జీవనం సాగిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నీలకంఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సీహెచ్సీకి తరలించారు.
Updated Date - Jun 17 , 2025 | 12:14 AM