A new look for roads రోడ్లుకు కొత్త రూపు
ABN, Publish Date - May 23 , 2025 | 12:43 AM
A new look for roads శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని సబ్బవరం-కొత్తవలస- కె.కోటపాడు రోడ్డుది. ఆర్అండ్బీ పరిధిలో ఉంది. కొత్తవలస మండల కేంద్రం నుంచి సబ్బవరం మీదుగా అనకాపల్లికి దగ్గర దారి.
రోడ్లుకు కొత్త రూపు
మారనున్న ఆర్అండ్బి రహదారులు
రూ.13.85 కోట్ల నాబార్డు నిఽధులు విడుదల
ఆరు ప్రధాన రోడ్లుకు కేటాయించిన ప్రభుత్వం
సబ్బవరం-కొత్తవలస-కె.కోటపాడు రహదారికి రూ.3.20కోట్లు
- శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని సబ్బవరం-కొత్తవలస- కె.కోటపాడు రోడ్డుది. ఆర్అండ్బీ పరిధిలో ఉంది. కొత్తవలస మండల కేంద్రం నుంచి సబ్బవరం మీదుగా అనకాపల్లికి దగ్గర దారి. అదే విదంగా కె.కోటపాడు మీదుగా దేవరాపల్లి, చోడవరం వెళ్లేందుకు అనుకూలం. ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు చాలా కాలం నుంచి రహదారిని మెరుగుపరచాలని కోరుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక పర్యాయాలు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రయోజనం లేకపోయింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ రోడ్డును అభివృద్ధి చేసేందుకు టీడీపీ హామీ ఇచ్చింది. ఈమేరకు రూ.3.20 కోట్ల నాబార్డు నిధులను కేటాయించింది.
శృంగవరపుకోట, మే 22(ఆంధ్రజ్యోతి):
రోడ్లు,భవనాల శాఖ (ఆర్అండ్బీ)కు చెందిన ఆరు రహదారులు జిల్లాలో మెరుగుపడ నున్నాయి. వీటిని బాగు చేసేందుకు నాబార్డు ఆర్ఐడీఎప్ నుంచి రూ.13.85 కోట్లు విడుదల చేశారు. పరిపాలన అనుమతులతో కూడిన ఉత్తర్వులను ఇటీవల రోడ్లు, భవనాల శాఖ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 191 ఆర్అండ్బీ రోడ్లును అభివృద్ధి చేసేందుకు రూ.400 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత వైసీపీ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసింది. దీంతో ఎక్కడికక్కడ పాడయ్యాయి. కొన్ని అభివృద్ధి పేరుతో తవ్వి వదిలేసింది. పనిచేసిన కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వక వారు మధ్యలో పనులు ఆపేశారు. మరికొన్ని రోడ్లకు కనీసం మరమ్మతులు చేపట్టలేదు. జిల్లాలో గ్రామీణ లింకు రోడ్లుకు ఆర్అండ్బి రోడ్లు అనుసంధానంగా ఉంటాయి. జాతీయ రహదారులకు కూడా కలుపుకొని ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాలన్నా ఈ రోడ్లును ఆశ్రయించకతప్పదు. స్టోన్ క్రషర్, ఇతర భారీ సామగ్రిని తీసుకెళ్లే వాహనాలు పరిమితికి మించిన బరువుతో తిరగడంతో రోడ్లు మరింత శిథిలమయ్యాయి. ఈ రోడ్లును బాగు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం నడం బిగించింది. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖకు చెందిన 64.71 కిలోమీటర్ల పొడవు కలిగిన 19 రోడ్ల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్యామ్యంతో రూ.24.92 కోట్లు అందించింది. వీటికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్ అనే తేడా లేకుండా పాడైన రోడ్లతో పాటు విస్తరించాల్సిన రోడ్లుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ప్రాధాన్యత క్రమంలో రోడ్లును అభివృద్ధి చేసే ప్రయత్నం జరుగుతోంది.
జిల్లాలో నాబార్డు నిధులతో మెరుగుపడనున్న ఆర్అండ్బి రోడ్లు
--------------------------------------
రోడ్డుపేరు కిలోమీటర్లు నిధులు రూ.కోట్లలో
---------------------------------------------------------------------------------------------------------
విజయనగరం-భోగాపురం 7.000 1.75
పినపెంకి-ఆకులకట్ట 8.253 2.90
రాజీవ్బొమ్మ - పాలకొండ కూడలి 4.548 3.00
కొంపంగి వయా పోరం, జక్కువ 3.400 1.80
కొండలింగాలవలస వయా ఎఎంవలస 6.000 1.20
సబ్బవరం-కొత్తవలస-కె.కోటపాడు 13.400 3.20
---------------------------------------------------------------------------------------------------------
అనందంగా ఉంది
ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. నా నియోజకవర్గ పరిధిలోని కొత్తవలస నుంచి సబ్బవరం-కె.కోటపాడు వరకు ఉన్న రోడ్డుకు నాబార్డు నిధులు అందించడం అనందంగా ఉంది. చొరవ తీసుకున్న సీఎం నారా చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు. ఇప్పటికే కొండ శిఖర ప్రాంతాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రోడ్లుకు నిధులు వచ్చాయి. ప్రభుత్వం అందించిన నిధులతో సకాలంలో రోడ్ల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటాను.
- కోళ్ల లలితకుమారి, శాసన సభ్యురాలు, శృంగవరపుకోట
Updated Date - May 23 , 2025 | 12:43 AM