ఉత్సాహంగా యోగా
ABN, Publish Date - Jun 21 , 2025 | 11:18 PM
జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులు, విద్యార్థులు, వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం జిల్లాలో అన్ని మండల కేంద్రాలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో 6,500 చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లాలో ఘనంగా యోగా దినోత్సవం
అనకాపల్లి, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులు, విద్యార్థులు, వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం జిల్లాలో అన్ని మండల కేంద్రాలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో 6,500 చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో 522 సచివాలయాల ఉద్యోగులు, 1,897 పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వేర్వేరు వేదికలపై ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణరావు, సీపీవో రామారావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగులు యోగా వేడుకల్లో పాల్గొన్నారు. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అధికారులు, విద్యార్థులు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వాకర్స్ క్లబ్, హార్ట్ఫుల్ నెస్ మెడిటేషన్ సంస్థ సహకారంతో సామూహిక యోగాసనాలు ఏర్పాటు చేశారు. ఎలమంచిలి ఇండోర్ స్టేడియం ఆవరణలో న్యాయమూర్తులు, న్యాయవాదులు యోగాసనాలు వేశారు. కాగా విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా నుంచి 60 వేల మంది హాజరయ్యారు.
Updated Date - Jun 21 , 2025 | 11:18 PM