వైసీపీ సభ్యుల రచ్చ
ABN, Publish Date - Apr 22 , 2025 | 12:22 AM
ఐటీడీఏలో సోమవారం జరిగిన 74వ పాలకవర్గ సమావేశంలో జీవో:3, గిరిజన స్పెషల్ డీఎస్సీపై వైసీపీ సభ్యులు రచ్చ చేశారు. దీంతో వారికి దీటుగా జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి జవాబివ్వడంతో ఆఖరికి చేసేది లేక సభ్యులు మిన్నకున్నారు.
జీవో:3, స్పెషల్ డీఎస్సీపై తేల్చాలని డిమాండ్
దీటుగా బదులిచ్చిన మంత్రి సంధ్యారాణి
వైసీపీ పాలనలోనే గిరిజనులకు అన్యాయం జరిగిందని వెల్లడి
పాడేరు, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): ఐటీడీఏలో సోమవారం జరిగిన 74వ పాలకవర్గ సమావేశంలో జీవో:3, గిరిజన స్పెషల్ డీఎస్సీపై వైసీపీ సభ్యులు రచ్చ చేశారు. దీంతో వారికి దీటుగా జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి జవాబివ్వడంతో ఆఖరికి చేసేది లేక సభ్యులు మిన్నకున్నారు. సమావేశం మొదలవ్వడంతోనే పెదబయలు జడ్పీటీసీ సభ్యుడు బొంజుబాబు, కొయ్యూరు ఎంపీపీ రమేశ్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, అరకులోయ ఎంపీ తనూజారాణి, ఎమ్మెల్సీ రవిబాబు, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, తదితరులు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జీవో:3ని పునరుద్ధరించాలని, ప్రస్తుత మెగా డీఎస్సీని నిలుపుదల చేసి, గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. సభ్యులంతా నిలబడి తమ డిమాండ్పై మంత్రి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. జీవో:3ని పునరుద్ధరిస్తామని, గిరిజన స్పెషల్ డీఎస్సీ ప్రకటిస్తామని పాలకవర్గ సమావేశఽంలో తీర్మానం చేయాలని అందరూ డిమాండ్ చేశారు. అయితే వారి తీరు కేవలం సమావేశంలో ఏదో రచ్చ చేయాలనే లక్ష్యంతో వచ్చినట్టు గుర్తించిన మంత్రి సంధ్యారాణి... జీవో:3 రద్దుపై వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశారని ప్రశ్నించారు. అదంతా మీ ప్రభుత్వం, మీరంతా ఉన్నప్పుడే జరిగిందని కదా? ఏం చేశారని నిలదీశారు. ఈ క్రమంలో మెగా డీఎస్సీతో గిరిజనులు అసంతృప్తితో ఉన్నారని పలువురు వైసీపీ సభ్యులు అనడంతో మంత్రి స్పందించారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఆందోళనతో ఉన్నారని, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అందరూ ఆనందంతో, ప్రశాంతంగా ఉన్నారని, మీలాంటి వైసీపీ వాళ్లు మాత్రమే అసంతృప్తితో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈక్రమంలో పలువురు సభ్యులు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని తప్పుబట్టడంతో మంత్రి మరింతగా స్వరం పెంచి ఏం బెదిరిస్తున్నారా?, భయపెడుతున్నారా?, మెగా డీఎస్సీని ఆపడమనేది జరగని పనని స్పష్టం చేశారు. గిరిజన అభ్యర్థులకు నష్టం కలగకుండా చూస్తామని, డీఎస్సీలో రెండు వేల పోస్టులు గిరిజనులకు కేటాయించామని, జీవో:3 స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏమి చేయాలనేదానినిపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, గిరిజనులకు న్యాయం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. వైసీపీ సభ్యులు పథకం ప్రకారం సమావేశాన్ని జరగకుండా చేయాలనే లక్ష్యంతో వచ్చారని, గత మూడేళ్లుగా సమావేశాలను నిర్వహించకపోగా, తాము నిర్వహిస్తే దానిని ఆపేందుకు ప్రయత్నించడం పద్ధతికాదని మంత్రి హెచ్చరించారు. గిరిజనులకు వైసీపీ అన్యాయం చేస్తే, తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని, సమావేశంలో రచ్చ చేయవద్దని, రచ్చ చేయాలనుకుంటే బయట చూసుకుందామన్నారు. ఈ క్రమంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కలుగజేసుకుని, అందరం గిరిజనుల సంక్షేమానికి పాటుపడాలని, అంతేగాని రచ్చ చేయడం సరికాదని హితవు పలికారు. దీంతో వైసీపీ సభ్యులు మిన్నకుండి తమ సీట్లలో కూర్చున్నారు. అయితే గత వైసీపీ పాలనలో నిర్లక్ష్యంతో నెలకొన్ని సమస్యలనే ప్రస్తుతం ఆ పార్టీ సభ్యులు ప్రస్తావించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Updated Date - Apr 22 , 2025 | 12:22 AM