ఏకలవ్య అందుబాటులోకి వచ్చేదెన్నడో?
ABN, Publish Date - Jun 08 , 2025 | 11:16 PM
అరకు ఏకలవ్య మోడల్ ఆశ్రమోన్నత పాఠశాల భవన సముదాయాల నిర్మాణాలు పూర్తి కావడంతో గత అక్టోబరు 2న ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. దీంతో అరకులోయలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహిస్తున్న ఈ పాఠశాల విద్యార్థులు తమ కష్టాలు తీరతాయని భావించారు.
గత ఏడాది అక్టోబరు 2న పాఠశాలను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ
అంచనా వ్యయం కంటే ఎక్కువ ఖర్చయిన రూ.2 కోట్లు చెల్లించాలని కాంట్రాక్టర్ డిమాండ్
బిల్లులు రాకపోవడంతో భవనాలను అప్పగించని వైనం
ఈ విద్యా సంవత్సరంలోనైనా అందుబాటులోకి వస్తుందని విద్యార్థులు పెట్టుకున్న ఆశలు ఆవిరి
అరకులోయ, జూన్ 8(ఆంధ్రజ్యోతి): అరకు ఏకలవ్య మోడల్ ఆశ్రమోన్నత పాఠశాల భవన సముదాయాల నిర్మాణాలు పూర్తి కావడంతో గత అక్టోబరు 2న ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. దీంతో అరకులోయలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహిస్తున్న ఈ పాఠశాల విద్యార్థులు తమ కష్టాలు తీరతాయని భావించారు. అయితే అంచనా వ్యయం కంటే ఎక్కువగా రూ.2 కోట్లు ఖర్చయిందని, ఆ బిల్లులు చెల్లించాలని అధికారులను కాంట్రాక్టర్ కోరారు. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఆ భవన సముదాయాలను ఇప్పటి వరకు కాంట్రాక్టర్ అప్పగించలేదు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు అరకొర వసతుల మధ్య అరకు యూత్ ట్రైనింగ్ సెంటర్లో చదువుతున్నారు. పాఠశాల కొత్త భవన సముదాయాలు అందుబాటులోకి వస్తే తమ కష్టాలు తీరతాయని భావించినా వారి ఆశలు అడియాశలయ్యాయి. బిల్లుల సమస్య ఉన్నప్పుడు ప్రధాని మోదీతో ఈ పాఠశాలను ఎలా ప్రారంభిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అరకు ఎంపీ, కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించి, ఈ విద్యా సంవత్సరంలోనైనా విద్యార్థులకు ఈ పాఠశాలను అందుబాటులోకి తేవాలని వారు కోరుతున్నారు.
Updated Date - Jun 08 , 2025 | 11:16 PM