దశాబ్దాల నాటి కల నెరవేరిన వేళ..
ABN, Publish Date - Jun 03 , 2025 | 12:22 AM
గిరిజన ప్రాంతంలో ఆదివాసీ గ్రామాలకు తారు రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. మండలంలోని శివారు సీపీఐ మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన చీడిగొంది గ్రామానికి రూ.87.19 లక్షల పీఎం జన్మన్ పథకం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం తారు రోడ్డు నిర్మించింది. దీంతో దశాబ్దాల నాటి కల నెరవేరిందని, తారు రోడ్డు నిర్మాణంతో రవాణా కష్టాలు, డోలీ మోతలు తప్పాయని ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- చీడిగొంది ఆదివాసీలకు తొలగిన రహదారి కష్టాలు
- రూ.87.19 లక్షల పీఎం జన్మన్ నిధులతో తారు రోడ్డు నిర్మాణం
- కేవలం 183 మంది జనాభా ఉన్నా నిధుల కేటాయింపు
- గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం
- ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్ ట్వీట్
- కూటమి ప్రభుత్వానికి రుణపడి వుంటామంటున్న ఆదివాసీలు
గూడెంకొత్తవీధి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో ఆదివాసీ గ్రామాలకు తారు రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. మండలంలోని శివారు సీపీఐ మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన చీడిగొంది గ్రామానికి రూ.87.19 లక్షల పీఎం జన్మన్ పథకం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం తారు రోడ్డు నిర్మించింది. దీంతో దశాబ్దాల నాటి కల నెరవేరిందని, తారు రోడ్డు నిర్మాణంతో రవాణా కష్టాలు, డోలీ మోతలు తప్పాయని ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 183 మంది జనాభా ఉన్న గిరిజన గ్రామానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో లక్కవరం నుంచి చీడిగొందికి రూ.87.19 లక్షల పీఎం జన్మన్ పథకం నిధులతో రహదారి నిర్మించామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల నిధులతో గ్రామీణాభివృద్ధిశాఖ అడవితల్లి బాట కార్యక్రమంలో ఇన్నేళ్లు సరైన రహదారి లేని గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సోమవారం ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఆదివాసీలు ఎదుర్కొంటున్న ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించేందుకు తొలి ప్రాధాన్యం ఇచ్చిందని ఆదివాసీలు, గిరిజన నాయకులు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.
జిల్లాలోని 22 మండలాల్లో ఆదివాసీలు కొన్నేళ్లుగా రహదారులు, తాగు, సాగునీరు, విద్య, వైద్యానికి దూరంగా జీవనం సాగిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆదివాసీ గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఒక్క గ్రామానికి కూడా తారు రోడ్డు నిర్మించకపోగా, అధ్వానంగా తయారైన రహదారులకు కనీస మరమ్మతులు చేపట్టలేదు. దీంతో గిరిజన గ్రామాలకు అంబులెన్సులు వెళ్లే పరిస్థితి లేక రోగులు, గర్భిణులను డోలీలో ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. జల్జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి గ్రామానికి తాగునీటి పథకాలు నిర్మించి ఇంటింటికీ కొళాయిలను ఏర్పాటు చేస్తున్నది. పీఎం జన్మన్, గ్రామీణ పథకాల ద్వారా పీవీటీజీలు, ఆదివాసీలకు భారీ మొత్తంలో పక్కా గృహాలను మంజూరు చేసింది. ఆదివాసీలకు విద్యను చేరువ చేసేందుకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేసింది. గిరిజన రోగులకు సకాలంలో వైద్యం అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో ప్రత్యేక నిధులతో శివారు గ్రామాలకు రూ.కోట్ల నిధులు వెచ్చించి రహదారులు నిర్మిస్తున్నారు.
183 మంది గిరిజనుల కోసం రూ.లక్షలు వెచ్చించి తారు రోడ్డు
మండలంలో కేవలం 183 మంది జనాభా కలిగిన చీడిగొంది గ్రామానికి రూ.87.19 లక్షల నిధులు వెచ్చించి 1.01 కిలోమీటర్ల రహదారిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. గతంలో ఈ రహదారిపై ప్రయాణం సాగించేందుకు ఆదివాసీలు ఎన్నో అవస్థలు పడేవారు. జీకేవీధి మండల కేంద్రానికి సమీపంలో ఉన్నప్పటికి రహదారి సదుపాయం లేక రోగులు, గర్భిణులను డోలీపై ఆస్పత్రులకు తీసుకొని వచ్చేవారు. గ్రామాలకు వాహనాలు వచ్చే పరిస్థితి లేక ఆదివాసీలు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను అతికష్టంపై మార్కెట్కి తరలించేవారు. గిరిజనుల రవాణా కష్టాలను గుర్తించి కేవలం నెల రోజుల వ్యవధిలో ప్రభుత్వం చీడిగొంది గ్రామానికి తారు రోడ్డు నిర్మించింది. దీంతో స్థానిక ఆదివాసీల ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.
Updated Date - Jun 03 , 2025 | 12:22 AM