హార్డ్వేర్-సాఫ్ట్వేర్ మిళితం కావలసిన సమయమిది
ABN, Publish Date - Jul 27 , 2025 | 01:29 AM
ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా ఐటీ రంగంలో హార్డ్వేర్-సాఫ్ట్వేర్ రెండూ మిళితమై పనిచేయాల్సిన అవసరం ఉందని ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు.
‘ఫ్యూజన్ ఏఐ’ సదస్సులో ఎంపీ ఎం.శ్రీభరత్
విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి):
ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా ఐటీ రంగంలో హార్డ్వేర్-సాఫ్ట్వేర్ రెండూ మిళితమై పనిచేయాల్సిన అవసరం ఉందని ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు. సిరిపురంలోని చిల్డ్రన్ ఎరీనాలో జరుగుతున్న ఫ్యూజన్ ఏఐ సదస్సుకు శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మౌలిక రంగాల్లో వైద్యం, విద్య, ట్రాఫిక్ వంటి అంశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకమైన పాత్ర పోషిస్తున్నదన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా సీఎస్ఆర్తో కొత్త డిజైన్లు తయారుచేయాలని సూచించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఐటీ పెట్టుబడులను రాబట్టడంలో విశాఖపట్నం తన ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. సదస్సు నిర్వాహకులు శ్రీధర్ కొసరాజు మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ (మేథస్సు)ను విభిన్న రంగాలతో అనుసంధానం చేయాలన్నారు. జియో చీఫ్ డేటా సైంటిస్ట్ శైలేష్ కుమార్, ఇన్ఫోసిస్ సెంటర్ హెడ్ ఎన్.సురేశ్ తదితరులు ప్రసంగించారు.
స్టీల్ ప్లాంటులో ర్యాండమ్ తనిఖీలు
విధులు ఎగ్గొట్టే ఉద్యోగులకు చెక్
మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు
సోమవారం నుంచి అమలు
ఎవరైనా తమకు కేటాయించిన విభాగంలో లేకుంటే నిబంధనల ప్రకారం చర్యలు
విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ ప్లాంటు యాజమాన్యం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. విధులకు హాజరైన ఉద్యోగులు వారి వారి శాఖల్లో ఉన్నారా? లేదా? అని తెలుసుకోవడానికి ర్యాండమ్ (ఎంపిక చేసిన)గా తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఉద్యోగులకు తెలియజేసింది. ఢిల్లీ నుంచి స్టీల్ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశం కాబట్టి అమలు చేస్తున్నామని పేర్కొంది.
స్టీల్ ప్లాంటులో కొంతకాలంగా ఉద్యోగుల హాజరుకు బయోమెట్రిక్ విధానం అనుసరిస్తున్నారు. ప్లాంటుకు వచ్చేటపుడు, తిరిగి వెళ్లిపోయేటపుడు బయోమెట్రిక్ వేయాలి. దానిని పరిగణనలోకి తీసుకొని జీతాలు ఇస్తున్నారు. అయితే కొంతమంది బయోమెట్రిక్ వేసిన తరువాత సంబంధిత విభాగానికి వెళ్లకుండా వేరే పనులు చక్కబెడుతున్నారని, తిరిగి డ్యూటీ ముగిసే సమయానికి వచ్చి మరో బయోమెట్రిక్ వేస్తున్నారని ఢిల్లీ కార్యాలయానికి సమాచారం అందింది. దాంతో వారు అన్ని విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఉద్యోగులంతా విధుల్లో ఉంటున్నారా?, లేదా?...అనేది చెక్ చేయాలని ఈ నెల 23న ఆదేశించింది. దానిని సోమవారం నుంచి అమలు చేస్తామని యాజమాన్యం అన్ని విభాగాలకు సమాచారం ఇచ్చింది. ఎవరైనా ఆయా విభాగాల్లో లేకపోతే నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించింది. దీనిపై కార్మిక, ఉద్యోగ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జీతాలు సక్రమంగా ఇవ్వకపోయినా కష్టపడి పని చేస్తున్నామని, పూర్తి సామర్థ్యంతో ప్లాంటును నడిపిస్తూ లాభాల బాటలోకి తీసుకువస్తున్నామని, అయినా ఇక్కడి సీఎండీ తమను విశ్వసించడం లేదని, అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఏ సంస్థ అయినా పరస్పర విశ్వాసంతో ముందుకు వెళుతుందని, కానీ ప్రస్తుత ఇన్చార్జి సీఎండీ ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తూ ఉద్యోగులు, కార్మికుల ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నారని వాపోతున్నారు.
Updated Date - Jul 27 , 2025 | 01:29 AM