శిథిలస్థితిలో పశువైద్యశాల
ABN, Publish Date - Jul 29 , 2025 | 01:04 AM
దశాబ్దాల క్రితం నిర్మించిన స్థానిక పశువైద్య కేంద్రం భవనం శిథిలావస్థకు చేరింది. శ్లాబ్ పెచ్చులు పూడిపోయి ఇనుప ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. వర్షం కురిస్తే భవనం కారిపోతున్నది.
పగుళ్లిచ్చిన గోడలు, శ్లాబ్ నుంచి ఊడిపడుతున్న పెచ్చులు
వర్షం కురిస్తే కారిపోతున్న భవనం
బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది
ఎలమంచిలి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాల క్రితం నిర్మించిన స్థానిక పశువైద్య కేంద్రం భవనం శిథిలావస్థకు చేరింది. శ్లాబ్ పెచ్చులు పూడిపోయి ఇనుప ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. వర్షం కురిస్తే భవనం కారిపోతున్నది.
ఎలమంచిలి పట్టణంలోని ప్రాంతీయ పశువైద్య కేంద్రంతో మునిసిపాలిటీతోపాటు మండలంలోని అన్ని గ్రామాల రైతులు సేవలు పొందుతుంటారు. ఇక్కడ పశువైద్యాధికారి, మరో ఇద్దరు సిబ్బంది వున్నారు. సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ కూడా సేవలు అందిస్తున్నారు. పశువ్యైదం, మందుల సరఫరా, సిబ్బంది కొరత లేనప్పటికీ.. వసతి సమస్య వేధిస్తున్నది. సుమారు ఆరున్నర దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంలోనే ఇప్పటికే పశువైద్యశాలను నిర్వహిస్తున్నారు. గోడలు పలుచోట్ల పగుళ్లిచ్చింది. శ్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపోయి ఇనుప ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. వర్షం కురిస్తే శ్లాబ్ నుంచి నీరు కారుతున్నది. ఉద్యోగులు భయంతో విధులు నిర్వహిస్తున్నారు. కాగా పశువైద్యశాల ఆవరణలోని మందులు నిల్వచేసే గిడ్డంగి గోడ హుద్హుద్ తుఫాన్ సమయంలో కూలిపోయింది. అప్పటి నుంచి గోదామును అలాగే వదిలేశారు. భవనం దుస్థితి గురించి పశు సంవర్థక శాఖ ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ మరమ్మతులు చేయించలేదు. కాగా ఎమ్మెల్యే విజయ్కుమార్ ఇటీవల అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పశువైద్యశాఖ భవనం దుస్థితి గురించి ఏడీ డాక్టర్ గంగాధర్ ఆయక దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో భవనాన్ని పరిశీలించి, సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడతానని ఎమ్మెల్యే చెప్పారు.
Updated Date - Jul 29 , 2025 | 01:04 AM