బదిలీల హడావిడి
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:20 AM
ప్రభుత్వ శాఖల్లో బదిలీల హడావిడి మొదలైంది. వచ్చే నెల రెండో తేదీ నాటికి అంటే సోమవారం సాయంత్రంలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.
వచ్చే నెల రెండో తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు
సిటీ, పరిసర ప్రాంతాలు, అనకాపల్లి చుట్టుపక్కల మండలాల్లో పోస్టింగ్ కోసం పలువురు తహశీల్దార్లు,
డిప్యూటీ తహశీల్దార్ల యత్నం
సిఫారసు లేఖల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు
స్వయంగా ఫోన్లు చేయిస్తున్న మరికొందరు...
ఇంచుమించు అన్ని శాఖల్లోనూ అదే పరిస్థితి
ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి స్థాన చలనం తప్పనిసరి
హౌసింగ్లో బదిలీలకు జాబితా సిద్ధం
విశాఖపట్నం, మే 31 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ శాఖల్లో బదిలీల హడావిడి మొదలైంది. వచ్చే నెల రెండో తేదీ నాటికి అంటే సోమవారం సాయంత్రంలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో అన్ని శాఖల్లో బదిలీ అయ్యే ఉద్యోగులతో కూడిన జాబితాలు సిద్ధమయ్యాయి. కొన్ని శాఖల్లో సోమవారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కోరుకున్న చోట పోస్టింగ్ కోసం అధికారులు, ఉద్యోగులు కొందరు కూటమి పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతల నుంచి సిఫారసు లేఖలు తీసుకుని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు. మరికొందరు స్వయంగా ఫోన్లు చేయించుకుంటున్నారు. బదిలీల మార్గదర్శకాల మేరకు ఒకేచోట ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులను విధిగా వేరొక చోటకు పంపాలి. స్పౌజ్, సంఘ నేతలను కొన్ని షరతుల మేరకు బదిలీల నుంచి మినహాయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు బదిలీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కీలకమైన రెవెన్యూలో బదిలీల కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రెండు రోజుల క్రితం మూడు జిల్లాల కలెక్టర్లు విశాఖలో సమావేశమై బదిలీలపై చర్చించారు. ఈలోగా పలువురు తహశీల్దార్లు, ఉద్యోగులు తమకు తెలిసిన ప్రజా ప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు సంపాదించి జిల్లా యంత్రాంగానికి అందజేశారు. ప్రధానంగా తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ కేడర్ అధికారులు బాగా ఆదాయం వచ్చే మండలాలు/నగరం, అనకాపల్లికి దగ్గర మండలాల్లో పోస్టింగ్స్ కోసం యత్నిస్తున్నారు. ఐదేళ్లకు మించి ఒకేచోట పనిచేసిన వారు కూడా తమను కదిలించవద్దంటూ లేఖలు అందజేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐదుగురు తహశీల్దార్లు మూడు నుంచి ఐదేళ్ల సర్వీస్ పూర్తిచేశారు. నిబంధనల మేరకు వారికి మైదానంలో అనకాపల్లి/విశాఖ జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వాలి. దీంతో నగరం నుంచి పలువురు తహశీల్దార్లకు స్థానచలనం తప్పనిసరిగా చెబుతున్నారు. ఆరోపణలు ఎక్కువగా ఉన్నవారితోపాటు పనితీరు పేలవంగా ఉన్న తహశీల్దార్లను పొరుగు జిల్లాలకు పంపాలని విశాఖ జిల్లా అధికారులు భావిస్తున్నట్టు రెవెన్యూ వర్గాల్లో వినిపిస్తోంది. తమకు తలనొప్పులు తెచ్చే అధికారులను సాగనంపుతారని జోరుగా ప్రచారం సాగుతుంది. నగరానికి దక్షిణ ప్రాంతంలో పనిచేస్తున్న తహశీల్దారు ఒకరు భీమిలి నియోజకవర్గంలో ఒక మండలానికి వెళ్లేందుకు సిఫారసు లేఖ సంపాదించారని చెబుతున్నారు.
ఇదిలావుండగా జల వనరుల శాఖలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న కొందరు ఉద్యోగులు నగరానికి రావడానికి ప్రజా ప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తీసుకున్నారు. కొందరు ఉద్యోగులు రెండు అంతకంటే ఎక్కువ లేఖలు సమర్పించారు. జిల్లా హౌసింగ్ కార్యాలయంలో పలువురు ఉద్యోగులు, ఇంజనీర్ల బదిలీకి అధికారులు జాబితా సిద్ధం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే బంధువునంటూ హల్చల్ చేస్తున్న అవుట్సోర్సింగ్ ఏఈని కూడా బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఖజానా కార్యాలయంలో పరిధిలో బదిలీల నిర్వహణకు అధికారులు కమిటీ వేశారు. అయితే సంఘ నేతలమని కొందరు, ఇతరత్రా కారణాలతో మరికొందరు బదిలీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పౌరసరఫరాల శాఖలో పలువురు చెకింగ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
Updated Date - Jun 01 , 2025 | 12:20 AM