ఆడుకునేందుకు వెళ్లి కానరాని లోకాలకు..
ABN, Publish Date - May 25 , 2025 | 12:26 AM
స్నేహితులతో క్రికెట్ ఆడుకుంటానని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా మారడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్టీల్ప్లాంట్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఏలేరు కాలువలో పడి మృతి చెందిన బాలుడు
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
ఉక్కుటౌన్షిప్, మే 24 (ఆంధ్రజ్యోతి): స్నేహితులతో క్రికెట్ ఆడుకుంటానని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా మారడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్టీల్ప్లాంట్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అగనంపూడి సమీపంలోని శనివాడ ప్రాంతానికి చెందిన చట్టి పైడిరాజు కుమారుడు చట్టి యశ్వంత్ (13) శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకునేందుకు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి బయటకు వెళ్లాడు. అయితే యశ్వంత్ అగనంపూడి సమీపంలో గల ఏలేరు కాలువలో పడి మృతి చెందాడు. కాలువలోని నీటి ప్రవాహానికి మృతదేహం కేబీఆర్ రిజర్వాయర్ వద్దకు కొట్టుకువచ్చింది. రిజర్వాయర్ వద్ద మృతదేహం ఉన్నట్టు గుర్తించిన సిబ్బంది స్టీల్ప్లాంట్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే గుర్తు తెలియని విద్యార్థి మృతదేహంగా పోలీసులు తొలుత భావించారు. ఈ మేరకు మృతుని ఫొటోను వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. ఇదిలావుండగా ఆడుకునేందుకు వెళ్లిన తమ కుమారుడు సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో యశ్వంత్ తండ్రి స్థానికంగా వాకబు చేశారు. ఈ క్రమంలో వాట్సాప్ గ్రూపులో యశ్వంత్ ఫొటో చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కాగా ఎంతమంది ఆడుకునేందుకు వెళ్లారు, ప్రమాదవశాత్తు యశ్వంత్ కాలువలో జారిపడ్డాడా, మరే ఇతర కారణం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - May 25 , 2025 | 12:26 AM