నీట్లో మెరిశారు
ABN, Publish Date - Jun 15 , 2025 | 12:31 AM
వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘నీట్’లో విశాఖ విద్యార్థులు సత్తా చాటారు.
ఓపెన్ కేటగిరీలో 59, 64, 70, 116, 238 ర్యాంకులు
100 నుంచి 1000 వరకూ మరికొందరికి...
ఇతర కేటగిరీలలో 17, 45, 172, 232 ర్యాంకులు
విశాఖపట్నం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి):
వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘నీట్’లో విశాఖ విద్యార్థులు సత్తా చాటారు. ఓపెన్ కేటగిరీలో 59, 64, 70, 116, 238, ఇతర కేటగిరీలలో 17, 45, 172, 232 ర్యాంకులు సాధించారు. శనివారం వెల్లడించిన నీట్ ఫలితాల్లో పలువురు 1000లోపు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. ఓపెన్ కేటగిరీలో డి.సూర్యచరణ్కు 59వ ర్యాంకు, పి.అవినాష్ 64, ఎర్రా సమీర్కుమార్ 70, కె.నిధి 116, జి.గురుచరణ్ 207, టి.శ్రీనాథ్ 238, డి.జాహ్నవి 358, జామి గిరిజ 425, ఎం.జయదీప్ 672వ ర్యాంకు, జి.లక్ష్మిచరణ్ 875వ ర్యాంకు సాధించారు. వివిధ కేటగిరీల్లో చూస్తే 402, 905, 1582, 1742, 1782, 2190, 2742, 2956 ర్యాంకులు లభించాయి. నగరంలో శ్రీచైతన్య, నారాయణ, శ్రీవిశ్వ, అసెంట్ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. ఓపెన్ కేటగిరీలో 1000లోపు ర్యాంకర్లకు ఎయిమ్స్, ఇతర ప్రముఖ వైద్య కళాశాలల్లో సీట్లు లభించనున్నాయి.
చిన్నతనం నుంచి డాక్టర్ కావాలని కోరిక
- 59వ ర్యాంకర్ సూర్యచరణ్
పాయకరావుపేట, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): తనకు చిన్నతనం నుంచి డాక్టర్ కావాలనే కోరిక ఉండేదని జాతీయ స్థాయిలో జనరల్ కేటగిరీలో 59వ ర్యాంకు సాధించిన దేశిన సూర్యచరణ్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపాడు. కాకినాడ జిల్లా బెండపూడి గ్రామం తమ స్వస్థలమని, తండ్రి ప్రసాద్ రైతు అని, తల్లి వాణి గృహిణి అని తెలిపాడు. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు గ్రామంలో గల అమ్మమ్మ ఇంట్లో ఉండి ఒకటి నుంచి 4వ తరగతి వరకు గాంధీ మోడల్ స్కూల్లో చదువుకున్నానన్నాడు. అనంతరం తల్లిదండ్రులు పాయకరావుపేట వచ్చేయడంతో 5 నుంచి 10వ తరగతి వరకూ శ్రీప్రకాష్ విద్యాసంస్థల్లో చదువుకున్నానన్నాడు. ఇంటర్ విశాఖపట్నంలోని నారాయణ విద్యా సంస్థల్లో చదివానని, ఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్లో చేరడం తన లక్ష్యమన్నాడు. తదుపరి న్యూరాలజిస్టు కావాలనుందని తెలిపాడు.
Updated Date - Jun 15 , 2025 | 12:32 AM