రెవెన్యూ బదిలీలకు రంగం సిద్ధం
ABN, Publish Date - May 30 , 2025 | 01:04 AM
ఉమ్మడి విశాఖ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. జూన్ 2వ తేదీలోగా బదిలీలను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 68 మంది దరఖాస్తు
ఏజెన్సీ నుంచి నగరానికి రావడానికి పలువురు ఎదురుచూపు
నగరం నుంచి అల్లూరు జిల్లాకు వెళ్లడానికి ఎక్కువ మంది విముఖత
సమావేశమైన మూడు జిల్లాల కలెక్టర్లు
విశాఖపట్నం, మే 29 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి విశాఖ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. జూన్ 2వ తేదీలోగా బదిలీలను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో తహశీల్దార్ నుంచి అటెండర్ వరకు మొత్తం 68 మంది ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించి విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ తుది జాబితాను ఖరారు చేయాలి. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టర్ అధ్యక్షతన విశాఖ నగరంలో జరిగిన సమావేశంలో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు విజయకృష్ణన్, దినేశ్కుమార్లు పాల్గొన్నారు. మూడు జిల్లాల పరిధిలో ప్రస్తుతం ఉన్న ఖాళీలు, ఐదేళ్లకు మించి ఒకేచోట పనిచేసిన డీటీలు/సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు ఎంతమంది ఉన్నారు..? అనేది జాబితా రూపొందించి వారికి స్థానచలనం కల్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు నివేదికలను సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది బదిలీల్లో ఏజెన్సీ నుంచి విశాఖ/అనకాపల్లి జిల్లాలకు బదిలీ అయిన తహశీల్దార్లలో ఇద్దరు ముగ్గురిని ఇప్పటివరకు రిలీవ్ చేయలేదు. వారి స్థానంలో విశాఖ, అనకాపల్లి నుంచి ఎవరూ ఏజెన్సీకి వెళ్లకపోవడంతో అక్కడి కలెక్టర్ పాడేరు డివిజన్లో పనిచేసే వారిని రిలీవ్ చేయలేదు.
జిల్లాల విభజన సమయంలో జూనియర్లను అల్లూరి జిల్లాకు పంపారు. ఆ తరువాత పదోన్నతులు రావడంతో కొందరు జూనియర్లు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సీనియర్ అసిస్టెంట్ల నుంచి డీటీలుగా, డీటీల నుంచి తహశీల్దార్లుగా పదోన్నతులు పొందారు. విశాఖలో పనిచేసేవారు ఎక్కువ మంది ఇక్కడ నుంచి అల్లూరి జిల్లాకు వెళ్లడానికి ఇష్టపడడం లేదనే వాదన వినిపిస్తోంది. దీంతో చాలామంది ఉద్యోగులు ఏజెన్సీలోనే పనిచేస్తున్నారు. వీరిలో 50 ఏళ్లు పైబడినవారు, పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఉన్నారని వారంతా వాపోతున్నారు. 60 ఏళ్లు పైబడిన తహశీల్దార్ ఒకరు తనను మైదానంలోకి బదిలీ చేయాలని ఏడాదిగా కోరుతున్నారు. ఇందుకు అనుగుణంగా ఏజెన్సీలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు ఇటీవల విశాఖ కలెక్టర్ను కలిసి తమను మైదానంలోకి బదిలీ చేయాలని వినతిపత్రం అందజేశారు. 50 ఏళ్లు వయసు దాటిన ఉద్యోగులను ఏజెన్సీకి బదిలీ చేయరాదని, ఒకవేళ చేసినా రెండేళ్ల తరువాత తిరిగి మైదానానికి పంపాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కాగా నిబంధనల మేరకు బదిలీలు చేసి.. ఏజెన్సీలో పనిచేసిన వారిని మైదానానికి పంపించకపోతే కొందరు కోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నారు. అయితే విశాఖలో ఐదేళ్లకు మించి పనిచేస్తున్న వారిని ఏజెన్సీకి పంపేందుకు అధికార యంత్రాంగం నిర్ణయించిందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇదిలావుండగా తమకు అనుకూల ప్రాంతాల్లో పోస్టింగుల కోసం ఇప్పటికే పలువురు ఉద్యోగులు పైరవీలు సాగిస్తున్నారు.
13 మంది ప్రధానోపాధ్యాయులకు బదిలీ
8 మంది స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా పదోన్నతి
విశాఖపట్నం మే 29 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు బదిలీలు నిర్వహించారు. మొత్తం 13 మంది హెచ్ఎంలకు వెబ్ ఆప్షన్ల ద్వారా బదిలీ చేశారు. ఇంకా ఖాళీగా ఉన్న హెచ్ఎం పోస్టుల భర్తీని గురువారం విశాఖ నగరంలోని సీతమ్మఽధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఆర్జేడీ విజయభాస్కర్ ఆధ్వర్యంలో చేపట్టారు. 8 మంది స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. పదోన్నతి పొందిన వీరిని ఆర్జేడీ అభినందించారు.
గ్రేడ్-2 హెచ్ఎంలుగా 67 మందికి పదోన్నతి
86 మంది హెచ్ఎంలకు బదిలీ
ఉమ్మడి విశాఖ జిల్లాలో జడ్పీ, మునిసిపల్ ఉన్నత పాఠశాలల్లో 86మంది గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులకు బదిలీ చేశారు. వీరిలో జడ్పీ పాఠశాలల హెచ్ఎంలు 71 మంది, మునిసిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 15 మంది ఉన్నారు. బదిలీల అనంతరం ఉమ్మడి జిల్లాలో 67 గ్రేడ్-2 హెచ్ఎం పోస్టులకు గురువారం సీతమ్మధారలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. స్కూలు అసిస్టెంట్లలో సీనియారిటీ జాబితాను ఖరారు చేసి 67 ఉన్నత పాఠశాలల హెచ్ఎంలగా నియమించారు. వీరిలో జడ్పీ పాఠశాలల్లో 66 మంది, మునిసిపాలిటీలో ఒకరిని నియమించారు.
Updated Date - May 30 , 2025 | 01:04 AM