తగ్గని వాన జోరు!
ABN, Publish Date - Jul 26 , 2025 | 11:11 PM
విశాఖ మన్యాన్ని వర్షాలు వదలడం లేదు. శనివారం సైతం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో గెడ్డలు, వాగుల్లో వరద ఉధృతి కొనసాగుతున్నది.
కొనసాగుతున్న గెడ్డల ఉధృతి
జన జీవనానికి అంతరాయం
ముంచంగిపుట్టులో అత్యధిక వర్షపాతం
కొయ్యూరులో గరిష్ఠ ఉష్ణోగ్రత
పాడేరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): విశాఖ మన్యాన్ని వర్షాలు వదలడం లేదు. శనివారం సైతం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో గెడ్డలు, వాగుల్లో వరద ఉధృతి కొనసాగుతున్నది. తాజా వాతావరణంతో జన జీవనానికి అంతరాయం ఏర్పడింది. పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. శుక్రవారం భారీ వర్షం కురవగా రాత్రి మాత్రం భారీగా ఈదురుగాలులు వీచాయి. ఒడిశాకు సరిహద్దులో ఉన్న ముంచంగిపుట్టు, జి.మాడుగుల, పెదబయలు, చింతపల్లి ప్రాంతాల్లో, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చింతూరు, కూనవరం, ఎటపాక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరుగా వానలు పడుతున్నాయి. ఖరీఫ్ వ్యవసాయ పనులకు ఇబ్బందికరంగా ఉందని రైతులు అంటున్నారు. ప్రస్తుత వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ముంచంగిపుట్టులో అత్యధిక వర్షపాతం
జిల్లాలో ఒడిశాకు సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టులో శనివారం అత్యధికంగా 45.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే జి.మాడుగులో 24.6, పెదబయలులో 16.8, చింతపల్లిలో 12.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా మిగిలిన మండలాల్లో అంతకంటే తక్కువగానే వర్షపాతం నమోదైంది.
కొయ్యూరులో 27.4 డిగ్రీల ఉష్ణోగ్రత
వర్షాలు కొనసాగుతుండడంతో ఉష్ణోగ్రతలు పెద్దగా పెరగడం లేదు. దీంతో శనివారం కొయ్యూరులో 27.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అనంతగిరిలో 26.2, అరకులోయలో 24.3, చింతపల్లిలో 23.5, పెదబయలులో 23.3, డుంబ్రిగుడలో 23.0, జీకేవీధిలో 22.8, ముంచంగిపుట్టులో 22.3, జి.మాడుగులలో 21.1, హుకుంపేటలో 17.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Updated Date - Jul 26 , 2025 | 11:11 PM