కౌలు రైతులకు తప్పని కష్టాలు
ABN, Publish Date - Jul 16 , 2025 | 01:02 AM
జిల్లాలోని కౌలు రైతులకు కష్టాలు తప్పడం లేదు. అనేక మంది కౌలు రైతులకు పంట సాగుదారుల హక్కు కార్డు (సీసీఆర్సీ)లు మంజూరుకాక ప్రభుత్వం రాయితీపై అందించే ఎరువులు, విత్తనాలను పొందలేకపోతున్నారు.
- దరఖాస్తు చేసుకున్నా అందని పంట సాగుదారుల హక్కు కార్డులు
- రాయితీపై విత్తనాలు, ఎరువులు దక్కని వైనం
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని కౌలు రైతులకు కష్టాలు తప్పడం లేదు. అనేక మంది కౌలు రైతులకు పంట సాగుదారుల హక్కు కార్డు (సీసీఆర్సీ)లు మంజూరుకాక ప్రభుత్వం రాయితీపై అందించే ఎరువులు, విత్తనాలను పొందలేకపోతున్నారు.
జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో పంట సాగుదారుల హక్కు కార్డు (సీసీఆర్సీ) కోసం కౌలు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 2025-26 సంవత్సరానికి జిల్లా వ్యవసాయాధికారులు ఆరు వేల మంది రైతులకు కార్డులు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రోజులు గడిచిపోతున్నా, కేవలం 983 మందికి మాత్రమే కార్డులు అందజేశారు. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా 5,017 మందికి అందజేయాల్సి ఉంది. 2024లో జారీ చేసిన కార్డుల కాల పరిమితి ఆగస్టు నెలతో ముగియనుంది. వాటిని రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి జిల్లాలో కౌలు రైతులు 75 వేల మందికి పైగా ఉన్నారని అంచనా. కాగా అధికారులు మాత్రం కేవలం కొద్ది మందికే కార్డులు అందజేసేందుకు ఏటా ప్రతిపాదనలు రూపొందించడం, వారికి కూడా రకరకాల నెపంతో పూర్తి స్థాయిలో కార్డులు అందజేయకపోవడం పరిపాటిగా మారిపోయింది. కౌలు రైతులకు కార్డులు అందకపోవడంతో వారు నష్టపోతున్నారు. ప్రభుత్వం రాయితీపై అందించే విత్తనాలు, ఎరువులు పొందలేకపోతున్నారు. కార్డులున్న రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకొనే అవకాశం ఉంది. కానీ కార్డులు లేకపోవడం వల్ల కౌలు రైతులు పంట దిగుబడులను దళారులకు విక్రయించుకోవలసి వస్తోంది.
Updated Date - Jul 16 , 2025 | 01:02 AM