పేదరికం లేని సమాజమే లక్ష్యం
ABN, Publish Date - Jul 12 , 2025 | 12:43 AM
పేదరికం లేని సమాజాన్ని రూపొందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు.
పి-4 కార్యాచరణపై ఇన్చార్జి మంత్రి డోలా సమీక్ష
జిల్లాలో 73,452 బంగారు కుటుంబాలు
మరోసారి పునఃపరిశీలన అనంతరం మార్గదర్శకుల ఎంపిక
చదువు, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన విషయంలో తోడ్పాటు
విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి):
పేదరికం లేని సమాజాన్ని రూపొందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పి-4 కార్యాచరణపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా తొలగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. దీనిలో భాగంగా విశాఖ జిల్లాలో 73,452 బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచనల మేరకు పీ-4 (పబ్లిక్, ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్) ద్వారా ఎంపిక చేసిన బంగారు కుటుంబాలను మరోసారి పునఃపరిశీలన కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది ద్వారా చేయిస్తామన్నారు. ఈ నెల 15 నుంచి 28 వరకూ పరిశీలన చేసి తుది జాబితా తయారుచేయడం జరుగుతుందన్నారు. బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకునేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. రూట్స్ యాప్ ద్వారా వివరాలను సేకరించి, ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి దిగ్విజయం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ మార్గదర్శుల సహాయ సహకారాలతో బంగారు కుటుంబాలనుపైకి తీసుకురావడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. చదువు, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయంలో బంగారు కుటుంబాలకు మార్గదర్శులు తోడ్పాటును అందిస్తారన్నారు. సమీక్ష సమావేశంలో ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పీవీజీఆర్ నాయుడు, పంచకర్ల రమేష్బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్యాదవ్, విష్ణుకుమార్రాజు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ కె.మయుర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 12 , 2025 | 12:43 AM