కూటమి నేత మాస్టర్ ప్లాన్
ABN, Publish Date - Jul 09 , 2025 | 01:08 AM
భవిష్యత్తులో అభివృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి అక్కడ రహదారులను ఏ మేరకు విస్తరించాలనే దానిపై వీఎంఆర్డీఏ, జీవీఎంసీ మాస్టర్ప్లాన్ను రూపొందిస్తుంటాయి.
జనసంచారం లేని రోడ్డును వంద అడుగులకు విస్తరించేలా ప్లాన్
అది ప్రస్తుతం 40 అడుగుల సీసీ రోడ్డు
వీఎంఆర్డీఏ మాస్టర్ప్లాన్-2041లో విస్తరణకు ప్రతిపాదన
రహదారి డెడ్ ఎండ్లో రైల్వే ట్రాక్
భవిష్యత్తులో అటువైపు నివాసాలు పెరిగేందుకు ఏమాత్రం అవకాశమే లేదు
అయినా ఆగమేఘాల మీద ఆర్డీపీ చేసిన జీవీఎంసీ అధికారులు
142 స్ట్రక్చర్ను తొలగించాల్సి ఉంటుందని టౌన్ప్లానింగ్ అధికారుల గుర్తింపు
వాటికి టీడీఆర్ జారీచేసేందుకు యత్నాలు
తెరవెనుక చక్రం తిప్పుతున్న నాయకుడు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
భవిష్యత్తులో అభివృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి అక్కడ రహదారులను ఏ మేరకు విస్తరించాలనే దానిపై వీఎంఆర్డీఏ, జీవీఎంసీ మాస్టర్ప్లాన్ను రూపొందిస్తుంటాయి. కానీ అభివృద్ధికి ఏమాత్రం అవకాశం లేదని తెలిసినప్పటికీ ప్రస్తుతం ఉన్న 40 అడుగుల రోడ్డును వంద అడుగులకు విస్తరించాలని వీఎంఆర్డీఏ మాస్టర్ప్లాన్-2041లో ప్రతిపాదించడం ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారింది. మాస్టర్ప్లాన్లో పొందుపరిచిందే తడవుగా జీవీఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు ఆర్డీపీ (రోడ్ డెవలప్మెంట్ ప్లాన్)కు నోటిఫికేషన్ జారీచేయడం, ఆగమేఘాల మీద సర్వే చేసి ఎఫెక్ట్ అవుతున్న స్ట్రక్చర్స్ను గుర్తించి వాటికి పరిహారంగా టీడీఆర్ జారీచేసేందుకు చర్యలు తీసుకుంటుండడం అనుమానాలకు దారితీస్తోంది. దీని వెనుక కూటమికి చెందిన ఒక నేతకు చెందిన బినామీ ఆస్తులు ఉండడమే కారణమని ప్రచారం జరుగుతోంది.
బీఆర్టీఎస్ రోడ్డులో నాయుడుతోట జంక్షన్ నుంచి పొర్లుపాలెం వరకూ 2.6 కిలోమీటర్ల రహదారి ఉంది. ఆ రోడ్డులో ఒక సిమెంట్ కర్మాగారం ఉండేది. ప్రస్తుతం మూతపడింది. ప్రభుత్వ పాఠశాలలు, జీవీఎంసీ వాటర్ వర్క్స్ కార్యాలయంతోపాటు కొన్ని నివాసాలు ఉన్నాయి. రోడ్డు చివరన పొర్లుపాలెం వద్ద రైల్వేట్రాక్ ఉండడంతో అక్కడితో ఎండ్ అయిపోయింది. భవిష్యత్తులో ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలు పెరిగేందుకు ఎలాంటి అవకాశం లేదు. ప్రస్తుతం ఆ రోడ్డుకు ఇరువైపులా మరో పది నుంచి 15 అడుగులు వరకు ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలం అవతల రోడ్డుకు ఒక వైపున ప్రభుత్వ స్థలాలే అత్యధికంగా ఉండగా, మరోవైపు గెడ్డవాగు, మరికొన్ని ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. మరికొన్ని ప్రైవేటు స్థలాలు, ఆస్తులు ఉన్నప్పటికీ రోడ్డుకు బాగా దూరంగానే ఉన్నాయి. అయితే వీఎంఆర్డీఏ అధికారులు ఎందుకోగానీ ఆ రోడ్డుపై భవిష్యత్తులో వాహనాల రాకపోకలు బాగా పెరిగిపోతాయని, ప్రజలు ఇబ్బంది పడతారని అనిపించింది. అందుకే రోడ్డును వంద అడుగులకు విస్తరించాలని మాస్టర్ప్లాన్-2041లో ప్రతిపాదించారు. దీనిని అనుసరించి రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ (ఆర్డీపీ) చేయడానికి జీవీఎంసీ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఆర్డీపీ కోసం సర్వే చేశారు. వేపగుంట సర్వే నంబర్ 75,76,77, వెంకటాపురం సర్వేనంబర్ 76, పొర్లుపాలెం సర్వేనంబర్ 76,82లో రోడ్డుకు ఒక వైపు 93 స్ట్రక్చర్లు, మరోవైపు 49 స్ట్రక్చర్లు మొత్తంగా 142 స్ట్రక్చర్లు ఎఫెక్ట్ అవుతున్నట్టు గుర్తించారు. ఆయా స్ట్రక్చర్లు 50,012 చదరపు మీటర్లు వైశాల్యంలో ఉన్నట్టు ఆర్డీపీలో పేర్కొన్నారు.
టీడీఆర్లు కొట్టేసేందుకే ఎత్తుగడ
అవసరం లేని రోడ్డును విస్తరించాలంటూ ప్రతిపాదించడం వెనుక టీడీఆర్లు కొట్టేయాలనే ఎత్తుగడ ఉందని కూటమి కార్పొరేటర్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఆ రహదారికి ఆనుకుని ఇరువైపులా ప్రభుత్వ స్థలాలతోపాటు కొన్ని ప్రైవేటు స్థలాలను బినామీ పేర్లతో కలిగివున్న కూటమికి చెందిన నేతే వెనకుండి అధికారులతో కథ నడిపిస్తున్నారని స్వపక్షానికి చెందిన కార్పొరేటర్లే ఆరోపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడున్న 40 అడుగుల సీసీ రోడ్డులోనే పెద్దగా జనసంచారం ఉండదని, చివరన రైల్వే ట్రాక్ ఉండడంతో భవిష్యత్తులో రద్దీ పెరిగే అవకాశం లేదని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ అధికార బలంతో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులపై ఒత్తిడి తెచ్చి అవసరం లేకపోయినా మాస్టర్ప్లాన్లో రోడ్డు విస్తరణ పెట్టించి, ఆగమేఘాల మీద ఆర్డీపీ చేశారని కూటమి కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఆర్డీపీలో సేకరించాలనుకున్న భూముల్లో చాలావరకు ఆక్రమణలే ఉన్నాయని, వాటికి కూడా పరిహారంగా టీడీఆర్ ఇచ్చేలా అధికారులు ఫైల్ సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం టౌన్ప్లానింగ్ అధికారుల వద్ద ప్రస్తావించగా ఆ రోడ్డులో కొంతభాగంపై కోర్టులో కేసు నడుస్తోందని, ఆర్డీపీ గురించి ఫైల్ పరిశీలించిన తర్వాతే మాట్లాడగలమని తప్పించుకుంటుండడం విశేషం.
Updated Date - Jul 09 , 2025 | 01:08 AM