డిప్యూటీ మేయర్ ఎంపిక నిర్ణయం మీదే..
ABN, Publish Date - May 15 , 2025 | 01:00 AM
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై స్థానికంగా అందరూ కలిసి సమష్టి నిర్ణయం తీసుకోవాలని మేయర్ పీలా శ్రీనివాసరావుతోపాటు నగరానికి చెందిన ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేసినట్టు తెలిసింది.
జీవీఎంసీ మేయర్, ఎమ్మెల్యేలకు సూచించిన సీఎం చంద్రబాబునాయుడు!
ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
విశాఖపట్నం, మే 14 (ఆంధ్రజ్యోతి):
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై స్థానికంగా అందరూ కలిసి సమష్టి నిర్ణయం తీసుకోవాలని మేయర్ పీలా శ్రీనివాసరావుతోపాటు నగరానికి చెందిన ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేసినట్టు తెలిసింది. మేయర్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత పీలా శ్రీనివాసరావు మొదటిసారి ముఖ్యమంత్రిని అమరావతిలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ మేయర్ పదవికి ఈ నెల 19న ఎన్నిక జరగనుండడం.. ఆ పదవిని పలువురు ఆశిస్తుండడంతో దీనిపై కూడా సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, పి.విష్ణుకుమార్రాజు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్, 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి, టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి దామచర్ల సత్య, తదితరులు అమరావతి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన వద్ద డిప్యూటీ మేయర్ పోస్టుకు పలువురు పోటీ పడుతున్నారని, యాదవ, కాపు సామాజిక వర్గాలకు చెందిన కూటమి కార్పొరేటర్ల నుంచి తీవ్రమైన పోటీ నెలకొన్నట్టు మేయర్, ప్రజాప్రతినిధులు వివరించారు. ‘వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారో నిర్ణయం మీదే’ అని చంద్రబాబుకు చెప్పగా.. అందుకు ఆయన స్పందిస్తూ స్థానిక రాజకీయ, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని, కూటమి పార్టీలకు నష్టం వాటిళ్లకుండా, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేలా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలంతా కూర్చుని ఏకాభిప్రాయంతో డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది. దీంతో డిప్యూటీ మేయర్ ఎంపిక మళ్లీ నగర ప్రజాప్రతినిధుల కోర్టులోకి వచ్చినట్టయింది. దీంతో సీఎం సమక్షంలో డిప్యూటీ మేయర్ ఎవరనే దానిపై పంచాయితీ తేలిపోతుందని భావించిన ఆశావహుల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.
నగర అభివృద్ధికి సహకరించండి
సీఎం చంద్రబాబుకు మేయర్ పీలా శ్రీనివాసరావు విజ్ఞప్తి
విశాఖపట్నం, మే 14 (ఆంధ్రజ్యోతి): విశాఖ నగర అభివృద్ధికి సహకరించవలసిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మేయర్ పీలా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. మేయర్గా ఎన్నికైన తరువాత తొలిసారిగా ఆయన బుధవారం అమరావతిలో సీఎంను పలువురు ప్రజాప్రతినిధులు, నేతలతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పీలా శ్రీనివాసరావును చంద్రబాబునాయుడు అభినందించారు. గత మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతోపాటు అవిశ్వాసం నెగ్గేలా చేయడానికి కృషి చేసిన మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎంపీలు, కూటమి ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లను సీఎం అభినందించారు. మేయర్గా నగరాభివృద్ధికి కృషి చేయాలని పీలాకు సూచించారు. కార్పొరేటర్లు, కూటమి ప్రజాప్రతినిధులను కలుపుకుంటూ పాలన సాగించాలన్నారు. మేయర్ బాధ్యతలు చేపట్టాక ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణపై విశేషంగా కృషి చేస్తున్నారంటూ పీలా శ్రీనివాస్ను అభినందించారు. చంద్రబాబును కలిసినవారిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన నగర అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి దామచర్ల సత్య, ఏపీయూఎఫ్ఐడీసీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్, కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి, తదితరులు ఉన్నారు.
Updated Date - May 15 , 2025 | 01:00 AM