కష్టాల్లో అన్నదాతలు
ABN, Publish Date - Aug 04 , 2025 | 12:21 AM
చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో సాగునీటి జలాశయాలు వున్నప్పటికీ వరినాట్లు సకాలంలో వేసే పరిస్థితి లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దాదాపు పది రోజుల నుంచి చినుకు జాడ లేదు. మరోవైపు వేసవిని తలపించేలా ఎండలు కాస్తున్నాయి. రైవాడ, కోనాం రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసినప్పటికీ, కాలువల చివర వున్న భూములకు నీరు చేరడంలేదు.
పది రోజుల నుంచి జాడలేని చినుకు
వేసవిని తలపించేలా ఎండలు
ఆకుమడుల్లో ఎండిపోతున్న వరి నారు
చుక్కనీరు లేని చెరువులు
మొదలుకాని దమ్ము, వరినాట్లు పనులు
కోనాం, రైవాడ రిజర్వాయర్ల నుంచి వారం క్రితమే నీరు విడుదల
ఆయకట్టు చివరి భూములకు ఇంతవరకు చేరని నీరు
20 శాతం విస్తీర్ణంలోనే వరినాట్లు పూర్తి
దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
చీడకాడ/దేవరాపల్లి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో సాగునీటి జలాశయాలు వున్నప్పటికీ వరినాట్లు సకాలంలో వేసే పరిస్థితి లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దాదాపు పది రోజుల నుంచి చినుకు జాడ లేదు. మరోవైపు వేసవిని తలపించేలా ఎండలు కాస్తున్నాయి. రైవాడ, కోనాం రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసినప్పటికీ, కాలువల చివర వున్న భూములకు నీరు చేరడంలేదు. వర్షాలు పడకపోవడంతో పొలాలను దమ్ము చేయడానికి రెండు, మూడు రెట్లు అధికంగా నీరు అవసరం అవుతున్నది. నాట్లు వేసేటప్పుడు, ఆ తరువాత కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఆకు మడుల్లో వరి నారు అందుబాటులోకి వచ్చినప్పటికీ నాట్లు వేయలేక, నారు ముదిరిపోతున్నదని రైతులు వాపోతున్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ఆరంభమై రెండు నెలలు దాటినా చెరువుల్లో కనీస స్థాయిలో కూడా నీరు చేరలేదు. వరినారును కాపాడుకోవడానికి సమీపంలో వున్న బావులు, చెరువుల నుంచి ఆయిల్ ఇంజన్లతో నీటిని పెట్టుకోవాల్సి వస్తున్నది. చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ గ్రౌండ్ రిపోర్ట్..
చీడికాడ మండలంలో కోనాం జలాశయం కింద ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇది కాకుండా చెరువుల కింద దాదాపు రెండు వేల ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు. కోనాం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు అంతగా కురవకపోవడంతో రిజర్వాయర్లోకి ఆశించినమేర నీరు చేరలేదు. ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 94.5 మీటర్లు మాత్రమే వుంది. పంట కాలువలకు గత నెల 25వ తేదీన నీటి విడుదలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఎగువ కాలువకు 30 క్యూసెక్కులు, దిగువ కాలువఉ 70 కూసెక్కుల చొప్పన నీటిని విడుదల చేస్తున్నారు. అయితే గత పది రోజుల నుంచి వర్షాలు పడకపోవడం, వేసవిని తలపించేలా ఎండలు కాస్తుండడంతో రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో ఆశాజనంగా లేదు. ఇదే సమయంలో దమ్ము, వరి నాట్లు వేయడానికి నీటి అవసరం పెరిగింది. కాలువలకు ఆనుకొని వున్న భూముల్లో మాత్రమే వరినాట్లు వేస్తున్నారు. కాలువల చివరి భూములకు నీరు అందకపోవడంతో దమ్ము, వరినాట్లు పనులు చేపట్టలేదు. వ్యవసాయ, జలవనరుల శాఖ అధికారుల గణాంకాల ప్రకారం ఇంతవరకు 20 శాతం ఆయకట్టులో మాత్రమే వరినాట్లు వేశారు. మిగిలిన విస్తీర్ణంలో దమ్ము చేసి, వరినాట్లు వేయడానికి రిజర్వాయర్లో ప్రస్తుతం వున్న నీరు చాలదు. సకాలంలో వరి నాట్లు వేయకపోతే నారు ముదిరిపోతుందని రైతులు ఆందోళచెందుతున్నారు. ఎండల కారణంగా వరినారును బతికించుకోవడానికి నానాపాట్లు పడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. కుంటలు, బావుల్లో నుంచి బిందెలు, కుండలతో నీటిని తెచ్చుకుని నారుమడులను తడుపుకుంటున్నారు. గత ఏడాది ఇదే సమయంతోపోలిస్తే రిజర్వాయర్లో మూడు మీటర్ల తక్కువ నీరు వుండడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నది.
ఇదిలా వుండగా మండలంలో కోనాం, మంచాల, వెల్లంకి, నీలంపేట, ఎన్.కొత్తూరు, చీడిపల్లి, పెదగోగాడ, అర్జునగిరి, చుక్కపల్లి, చెట్టుపల్లి గ్రామాల్లో చెరువుల కింద సుమారు రెండు వేల ఎకరాల ఆయకట్టు వుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువుల్లో నీరు చేరలేదు. దీంతో ఒక్క ఎకరంలో కూడా వరినాట్లు వేయలేదు. ఆకుమడులు బీటలు వారి వరి నారు ఎండిపోతున్నది. పొలాలను దమ్ము పట్టాల్సిన సమయంలో, దుక్కి దున్నుకుంటున్నారు. వారం రోజుల్లో వర్షాలు కురవకపోతే వరిసాగు లేనట్టేనని చెరువుల ఆయకట్టు రైతులు అంటున్నారు.
ఇంతవరకు కాలువ నీరు రాలేదు
దారపు మండేలు, నీటిసంఘం అధ్యక్షుడు, దిబ్బపాలెం, చీడికాడ మండలం (2సిడికె 10)
కోనాం జలాశయం నుంచి గత నెల 25వ తేదీన కాలువలకు నీటి విడుదలను ప్రారంభించారు. సాధారణంగా వారం రోజుల్లో ఆయకట్టు చివరి భూములకు కూడా నీరు చేరుతుంది. కానీ కొద్ది రోజుల నుంచి వర్షాలు పడకపోవడంతో కాలువలకు ఆనుకొని వున్న భూములకే నీరు వస్తున్నది. ఆయకట్టు చివరనున్న దిబ్బపాలెం, దండిసురవరం, తునివలస గ్రామాల భూములకు నీరు ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
దేవరాపల్లి మండలంలో..
రైవాడ జలాశయం నుంచి గత వారం నీటిని విడుదల చేయగా, ఇప్పుడిప్పుడే దమ్ము, నాట్లు పనులు మొదలయ్యాయి. అయితే కాలువల చివరనున్న భూములకు ఇంకా నీరుచేరలేదు. ఈ కారణంగా వరినాట్లు కొంత ఆలస్యం అయ్యే అవకాశం వుందని రైతులు చెబుతున్నారు. ఇదిలావుండగా మండలంలోని నాగయ్యపేట, సీతంపేట వెంకటరాజపురం, తెనుగుపూడి, గర్శింగి, వాకపల్లి, తామరబ్బ, సోంపురం, సమ్మెద, చింతలపూడి తదితర గ్రామాల్లో వర్షాధార చెరువుల కింద వరి సాగు చేస్తుంటారు. పది రోజుల క్రితం కురిసిన వర్షాలతో కొంతమంది నాట్లు వేయగా, అనంతరం వర్షం లేకపోవడంతోపాటు ఎండలు మండిపోతుండడంతో వరినాట్లు ఎండిపోతున్నాయి. సాధారణంగా జూలై చివరినాటికి వరినాట్లుపూర్తవుతాయి. అయితే వర్షాభావం వల్ల చెరువుల్లో అరకొరగా నీరు చేరడం, నాట్లువేయడానికి సరిపడ నీరు లేకపోవడంతో ఇంతవరకు 20 శాతం విస్తీర్ణంలో కూడా వరినాట్లు వేయలేదు. కొంతమంది రైతులు సుమారు కిలోమీటర్ దూరంలో వున్న ఇతర రైతులకు చెందిన బోర్లు నుంచి ట్యూబుల ద్వారా నీటి తీసుకొని వరినాట్లు వేసుకుంటున్నారు.
Updated Date - Aug 04 , 2025 | 12:21 AM