ఇసుక, గ్రావెల్ దందాపై టాస్క్ ఫోర్స్
ABN, Publish Date - Jun 03 , 2025 | 12:26 AM
మండలంలో ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు, రవాణా నిరోధానికి పంచాయతీల వారీగా రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో టాస్క్ఫోర్సు బృందాలను ఏర్పాటు చేస్తూ తహసీల్దార్ అంబటి రామారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పంచాయతీల వారీగా బృందాలు ఏర్పాటు
ఒక్కో టీమ్లో వీఆర్వో, వీఆర్ఏ, మహిళా పోలీసు
అక్రమ తవ్వకాలు జరిగితే ఈ బృందంపై క్రమశిక్షణ చర్యలు
ఉత్తర్వులు జారీ చేసిన చోడవరం తహసీల్దార్
స్వాగతించిన జనసేన పార్టీ ఇన్చార్జి పీవీఎస్ఎన్ రాజు
చోడవరం, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు, రవాణా నిరోధానికి పంచాయతీల వారీగా రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో టాస్క్ఫోర్సు బృందాలను ఏర్పాటు చేస్తూ తహసీల్దార్ అంబటి రామారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో గవరవరం, లక్కవరం, శేమునాపల్లి, జుత్తాడ, గజపతినగరం, ముద్దుర్తి, వెంకన్నపాలెం, గంధవరం. రాయపురాజుపేట, నరసాపురం, బెన్నవోలు గ్రామాల పరిధిలో శారదా నదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు సాగుతుండడంపై జనసేన ‘చోడవరం’ ఇన్చార్జి పీవీఎస్ఎన్ రాజు, పార్టీ నాయకులు గత నెల 27న తహసీల్దార్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అంతేకాక 48 గంటల్లో తవ్వకాలు ఆగకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దీంతో రెవెన్యూ అధికారులు స్పందించి ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు సాగుతున్న రాయపురాజుపేట, గవరవరం, జుత్తాడ, లక్కవరం, గజపతినగరం, ముద్దుర్తి, గంధవరం పంచాయతీల్లో వీఆర్వో, వీఆర్ఏ, మహిళా పోలీసులతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు, రవాణా జరగకుండా నిఘా ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంలో విఫలమైతే సంబంధిత బృందంలోని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు కలెక్టర్కు నివేదిస్తామని తహసీల్దార్ స్పష్టం చేశారు. కాగా ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు, రవాణాను నిరోధించడానికి టాస్క్ఫోర్సు బృందాలను ఏర్పాటు చేయడాన్ని జనసేన పార్టీ ఇన్చార్జి పీవీఎస్ఎన్ రాజు స్వాగతించారు.
Updated Date - Jun 03 , 2025 | 12:26 AM