వసతికి విద్యార్థుల పాట్లు
ABN, Publish Date - Jun 26 , 2025 | 01:13 AM
వేసవి సెలవులు ముగిసి, విద్యా సంస్థలు తెరిచేనాటికి సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు మరమ్మతులు పూర్తి చేసి, విద్యార్థులకు సిద్ధం చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి కాంట్రాక్టర్ నిర్వాకం కారణంగా గండిపడింది. వసతిగృహాల మరమ్మతు పనులు చేపట్టిన కాంట్రాక్టర్, బిల్లులు విడుదల కాలేదన్న సాకుతో పనులు మధ్యలోనే వదిలేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, ఇటుచూస్తే వసతిగృహాల మరమ్మతు పనులు పూర్తికాకపోవడంతో విద్యార్థులు రోజూ వ్యయప్రయాసలతో ఇంటి నుంచి కళాశాలలకు రాకపోకలు సాగిస్తున్నారు.
అసంపూర్తిగా సంక్షేమ హాస్టళ్ల మరమ్మతు పనులు
బిల్లులు మంజూరు కాలేదంటూ మధ్యలో వదిలేసిన కాంట్రాక్టర్
విద్యా సంవత్సరం ప్రారంభమైనా తెరుచుకోని వసతిగృహాలు
విద్యార్థులకు వ్యయప్రయాసలు
రోజూ ఇంటి నుంచి రాకపోకలు
చోడవరం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులు ముగిసి, విద్యా సంస్థలు తెరిచేనాటికి సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు మరమ్మతులు పూర్తి చేసి, విద్యార్థులకు సిద్ధం చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి కాంట్రాక్టర్ నిర్వాకం కారణంగా గండిపడింది. వసతిగృహాల మరమ్మతు పనులు చేపట్టిన కాంట్రాక్టర్, బిల్లులు విడుదల కాలేదన్న సాకుతో పనులు మధ్యలోనే వదిలేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, ఇటుచూస్తే వసతిగృహాల మరమ్మతు పనులు పూర్తికాకపోవడంతో విద్యార్థులు రోజూ వ్యయప్రయాసలతో ఇంటి నుంచి కళాశాలలకు రాకపోకలు సాగిస్తున్నారు.
చోడవరం పట్టణంలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన కళాశాల బాలుర వసతిగృహం సిటిజన్ కాలనీలో, బాలికల వసతిగృహం చీడికాడ రోడ్డులో ఉన్నాయి. చాలా ఏళ్ల నుంచి నిర్వహణ లేకపోవడంతో శిఽథిలావస్థకు చేరాయి. వర్షం కురిస్తే శ్లాబ్ నుంచి నీరు కారుతున్నది. కిటికీల తలుపులు సరిగా లేకపోవడంతో దోమలు, ఈగల బెడదతోపాటు చలితో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా తయారయ్యాయి. విద్యార్థులు ఈ సమస్యలను గత ప్రభుత్వ హయాంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ మరమ్మతులు చేయించలేదు. గత ఏడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించింది. అయితే అప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో మరమ్మతు, అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలుకాలేదు. దీంతో ఈ ఏడాది వేసవి సెలవుల్లో పనులు చేయించాలని ఆదేశించడమే కాకుండా మార్చి నెలలో అన్ని వసతిగృహాల మరమ్మతులకు నిఽధులు మంజూరు చేసింది. చోడవరంలో కళాశాలల విద్యార్థులకు చెందిన రెండు వసతిగృహాలకు రూ.60 లక్షలు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ అదే నెలల మరమ్మతు పనులు మొదలుపెట్టారు. వేసవి సెలవుల అనంతరం కళాశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తొలుత చురుగ్గానే పనులు జరిగాయి. సుమారు రూ.30 లక్షల మేర పనులు పూర్తయిన తరువాత అధికారుల ద్వారా కాంట్రాక్టర్ బిల్లులు అప్లోడ్ చేయించారు. నిధులు విడుదల అయిన తరువాత మిగిలిన పనులు చేయాలన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. ఇది జరిగి సుమారు నెలన్నర అవుతున్నది. కానీ బిల్లు మాత్రం మంజూరు కాలేదు.. కాంట్రాక్టర్ పనులను పునరుద్ధరించలేదు. బాలుర వసతిగృహానికి సంబందించి సగం గదులకు పైకప్పు వేసి మిగిలిన గదులను వదిలేశారు. మరుగుదొడ్లు సిద్ధం అయినప్పటికీ వాటికి రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పించలేదు. పై కప్పు వేసిన గదులకు విద్యుత్ వైరింగ్, ఫ్యాన్లు, ఇతర పనులు చేయలేదు. బాలికల వసతిగృహంలో గదులకు పైకప్పు పూర్తయినప్పటికీ గదుల్లో చేయవలసిన పనులు అలాగే ఉండిపోయాయి. మొత్తం పనులు పూర్తయితే తప్ప విద్యార్థులు ఆశ్రయం పొందడానికి వీలకాదు.
ఇళ్ల నుంచి రాకపోకలు
చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాలకు చెందిన విద్యార్థులు చోడవరంలో ఇంటర్, డిగ్రీ చదువుతూ, ఈ వసతిగృహాల్లో ఆశ్రయం పొందుతుంటారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ, వసతిగృహాలు అందుబాటులోకి రాకపోవడంతో ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ ఇళ్ల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు అన్ని గ్రామాలకు లేకపోవడంతో ఎక్కువ మంది విద్యార్థులు సర్వీసు ఆటోల్లో వస్తున్నారు. చార్జీల కోసం చేతి డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తున్నదని, అంతేకాక ఉదయం ఇంటి వద్ద వంటపూర్తికాకపోతే మధ్యాహ్న భోజనం ఇక్కడ హోటళ్లలో చేస్తున్నట్టు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వసతిగృహాల మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తిచేయించాలని విద్యార్థులు కోరుతున్నారు. కాగా వసతిగృహాల్లో మరమ్మతు పనులు ఆగిపోవడంపై జిల్లా సహాయ సంక్షేమ శాఖ అధికారి బి.ఈశ్వరరావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. కాంట్రాక్టర్ పనులు ఆపేసిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఇప్పటికే కాంట్రాక్టర్కు చెప్పామని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి వసతిగృహాలను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.
Updated Date - Jun 26 , 2025 | 01:13 AM