ఆగిన రోడ్డు పనులు
ABN, Publish Date - Jun 07 , 2025 | 12:35 AM
జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో రహదారుల అభివృద్ధి పనులు నత్తతో పోటీ పడుతున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో అత్యంత ముఖ్యమైన చోడవరం నియోజకవర్గంలో బీఎన్ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులను ఎప్పుడో అటకెక్కించేశారు. మరో ప్రధానమైన వడ్డాది నుంచి మాడుగుల మండలం తాటిపర్తి వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు ఇటీవల వరకు మందకొడిగా సాగ్గా.. వారం రోజుల క్రితం పనులను పూర్తిగా ఆపేశారు. వాస్తవంగా ఈ నెలాఖరునాటికి పూర్తికావాల్సిన ఈ రోడ్డు పనులు ఇంతవరకు 30 శాతం మాత్రమే అయ్యాయి.
వడ్డాది- గరికబంద మధ్య వాహనదారులు, ప్రయాణికుల పాట్లు
ఆరు నెలల క్రితం రూ.12 కోట్లతో విస్తరణ, అభివృద్ధి పనులు మొదలు
జూన్నాటికి పూర్తిచేయాలని ఒప్పందం
ఆది నుంచీ మందకొడిగానే పనులు నిర్వహించిన కాంట్రాక్టర్
వారం రోజుల నుంచి పూర్తిగా నిలిపివేత
పట్టించుకోని ఆర్అండ్బీ అధికారులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో రహదారుల అభివృద్ధి పనులు నత్తతో పోటీ పడుతున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో అత్యంత ముఖ్యమైన చోడవరం నియోజకవర్గంలో బీఎన్ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులను ఎప్పుడో అటకెక్కించేశారు. మరో ప్రధానమైన వడ్డాది నుంచి మాడుగుల మండలం తాటిపర్తి వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు ఇటీవల వరకు మందకొడిగా సాగ్గా.. వారం రోజుల క్రితం పనులను పూర్తిగా ఆపేశారు. వాస్తవంగా ఈ నెలాఖరునాటికి పూర్తికావాల్సిన ఈ రోడ్డు పనులు ఇంతవరకు 30 శాతం మాత్రమే అయ్యాయి.
బుచ్చెయ్యపేట మండలం వడ్డాది నుంచి మాడుగుల మండలం మీదుగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డులో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వేలాది మంది ప్రజలు, వందలాది వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. మాడుగుల మండలం తాటిపర్తి నుంచి పాడేరు వరకు దాదాపు కొండప్రాంతం (ఘాట్) కావడంతో రహదారి బాగానే వుంది. అయితే వడ్డాది నుంచి తాటిపర్తి వరకు సుమారు 14 కిలోమీటర్ల రహదారి నిర్వహణ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. కనీసం గోతులు కూడా కప్పకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వడ్డాది నుంచి తాటిపర్తి వరకు ప్రయాణించడానికి అటుఇటుగా 30 నిమిషాలు పడుతుంది. కానీ రోడ్డు మొత్తం గోతులు ఏర్పడడంతో గంటసేపు ప్రయాణించాల్సి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో కొన్నిచోట్ల సిమెంట్ కాంక్రీట్ మిక్చర్తో మొక్కుబడిగా గోతులు కప్పి చేతులు దులుపుకున్నారు. తరువాత కురిసిన వర్షాలకు కాంక్రీట్ మిక్చర్ కొట్టుకుపోయి, రాళ్ల పిక్కలు పైకి తేలాయి. దీంతో ద్విచక్రవాహనదారులకు ఇబ్బందులు మరింత పెరిగాయి.
ఇదిలావుండగా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డాది-గరికబంద రోడ్డు విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమారు 14 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి ఆర్అండ్బీ అధికారులు రూ.12 కోట్ల అంచనాలతో గత ఏడాది డిసెంబరులో టెండర్లు ఖరారు చేశారు. కాంట్రాక్టర్ వెంటనే పనులు మొదలుపెట్టారు. ఈ ఏడాది జూన్నాటికి పనులు పూర్తిచేయాలన్నది అగ్రిమెంట్. అవసరమైనచోట రోడ్డుకు ఇరువైపులా మీటరు చొప్పున రెండు అడుగుల మేర తవ్వేసి, అందులో వెట్మిక్స్ వేసి రోలింగ్ చేయాలి. కొన్నిచోట్ల సీసీ రోడ్డు నిర్మించాలి. తరువాత బీటీ రోడ్డు వేయాలి. రహదారిని రెండు భాగాలుగా చేసి, ఒకవైపు సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. పనుల కోసం తీసుకువచ్చిన ఇసుక, కంకర, సిమెంట్ బస్తాలను రోడ్డుపైనే వుంచేశారు. అసలే రోడ్డు చిన్నది కావడం, పైగా నిర్మాణ సామగ్రిని రోడ్డుపైనే వుంచడం, ఆ సమయంలో వర్షాలు కూడా లేకపోవడంతో దుమ్ము, ధూళి ఎగిసిపడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు... ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వుంది. వాస్తవంగా ఈ నెలాఖరునాటికి రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు పూర్తికావాలి. కానీ ఇంతవరకు 30 శాతం కూడా కాలేదు. కారణం ఏమిటో తెలియదుగానీ వారం రోజుల క్రితం కాంట్రాక్టర్ పనులు ఆపేశారు.
పనులు నిలిచిన మాట వాస్తవమే
విద్యాసాగర్, ఈఈ, ఆర్అండ్బీ
వడ్డాది నుంచి తాటిపర్తి వరకు రోడ్డు అభివృద్ధి, విస్తరణ పనులు కొద్దిరోజులుగా నిలిచిపోవడం వాస్తవమే. నాణ్యతా విభాగం (క్వాలిటీ కంట్రోల్) ఇంజనీర్లు ఇటీవల పనులను పరిశీలించి వెళ్లారు. వడ్డాది నుంచి ఘాటీ రోడ్డు వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు క్వాలిటీ విభాగం నుంచి అనుమతులు వచ్చాయి. ఘాటీ రోడ్డు నుంచి తాటిపర్తి వరకు రోడ్డు పనులకు క్వాలిటీ విభాగం నుంచి త్వరలోనే అనుమతులు వస్తాయి.
Updated Date - Jun 07 , 2025 | 12:35 AM